ఆరోగ్య విప్లవం

29 Jan, 2020 04:32 IST|Sakshi

రాష్ట్రవ్యాప్తంగా కోటి మందికి వైద్య పరీక్షలు

గ్రామీణ ప్రాంతాల్లో 74 లక్షలు.. పట్టణాల్లో 26 లక్షల మందికి

మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్,గుండె జబ్బుల నియంత్రణకు చర్యలు

క్షయ, కుష్ఠు వ్యాధుల నిర్ధారణ కూడా

ఏప్రిల్‌ 1 నుంచి సెప్టెంబర్‌ 30లోగా వైద్య పరీక్షలు పూర్తి 

గ్రామీణ ప్రాంతాల్లో 12వేల మంది..

పట్టణ ప్రాంతాల్లో 4 వేల మంది ఏఎన్‌ఎంల సేవలు

ప్రాథమిక నిర్ధారణ అనంతరం జబ్బు తీవ్రతను బట్టి ఆస్పత్రులకు తరలింపు

జబ్బు నిర్ధారణ అనంతరం ప్రతి ఒక్కరికీ ఉచితంగా మందులు

ఈ ప్రక్రియలో ప్రతీ రోగికి చెందిన ఆరోగ్య సమాచారం సేకరణ

ఆ తర్వాత క్యూఆర్‌ కోడ్‌తో కూడిన కార్డులో ఆ వివరాలు నిక్షిప్తం

రాష్ట్రంలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్న సర్కారు

సాక్షి, అమరావతి: ప్రజాసంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరో విప్లవాత్మక అడుగు వేస్తోంది. జీవనశైలి వ్యాధులతో సతమతమవుతున్న గ్రామీణ, పట్టణ పేదలకు సాంత్వన కలిగించాలని సంకల్పించింది. ప్రధానంగా మధుమేహం, రక్తపోటు, గుండెజబ్బులు, క్యాన్సర్‌ వంటివి చాపకింద నీరులా విస్తరిస్తున్న నేపథ్యంలో వాటిని నియంత్రించడం, నివారించడానికి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది.

ఈ వ్యాధులపై అవగాహన లేని కారణంగా వారు ఎంతో నష్టపోతున్నారు. దీనిని అధిగమించేందుకు వచ్చే ఏప్రిల్‌ 1 నుంచి సెప్టెంబర్‌ 30వ తేదీలోగా ఆరు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా కోటి మందికి వైద్య పరీక్షలు నిర్వహించేలా ఓ బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకు వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగా.. ముందుగా గ్రామీణ ప్రాంతాల్లో 74 లక్షల మందికి, పట్టణ ప్రాంతాల్లో 26 లక్షల మందికి ఈ వైద్య పరీక్షలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ జబ్బుల తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలను ఆశా వర్కర్లు, వార్డు ఏఎన్‌ఎంల సాయంతో గుర్తించి ప్రతి ఇంటిలో ఉన్న సభ్యులందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.

ఆ నాలుగింటిపై ప్రధాన దృష్టి
రాష్ట్రంలో ప్రధానంగా నాలుగు జబ్బులపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించింది. మధుమేహం, రక్తపోటు (హైపర్‌ టెన్షన్‌), గుండెజబ్బులు (కార్డియో వాస్క్యులర్‌)లతో పాటు సాంక్రమిక వ్యాధులుగా చెప్పుకునే క్షయ, కుష్ఠు వ్యాధుల నియంత్రణపై దృష్టి పెట్టనుంది. ఇటీవలే రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి సుజాతారావు అధ్యక్షతన రాష్ట్రంలో పర్యటించిన నిపుణుల కమిటీ కూడా రాష్ట్రంలో కోటి మందికి పైగా జీవనశైలి జబ్బులతో బాధపడుతున్నట్లు తన నివేదికలో పేర్కొంది.

ఈ సంఖ్య ఏటా పెరుగుతున్న పరిస్థితుల్లో ఇంటింటికీ వెళ్లి వారికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు సరఫరా చేసేలా చర్యలు తీసుకోనున్నారు. మొబైల్‌ మెడికల్‌ యూనిట్‌ (104 వాహనాల) సిబ్బంది సాయంతో ఈ పరీక్షలు నిర్వహించడం, వ్యాధి తీవ్రతను బట్టి రోగులను పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, జిల్లా ఆస్పత్రులు, బోధనాసుపత్రులకు తీసుకెళ్తారు. అలాగే, వ్యాధులున్నట్లు తేలితే బాధితులకు నెలనెలా ఉచితంగా మందులు ఇచ్చే ఏర్పాట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది. వ్యాధి ప్రాథమిక దశలో ఉన్నా, లేదా వచ్చే సూచనలున్నా వాటి నియంత్రణకు మందులివ్వడం, లేదా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అన్నదానిపై వైద్యులు సూచనలు ఇస్తారు. కాగా, ఈ వైద్య పరీక్షలు ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి సెప్టెంబర్‌ 30లోగా పూర్తిచేయాలని నిర్దేశించారు.

రోగుల డేటా మొత్తం సేకరణ..
కాగా, ఆరోగ్యశ్రీ పరిధిలోని వారికి క్యూఆర్‌ కోడ్‌తో కూడిన కొత్త హెల్త్‌ కార్డులను త్వరలో ఇవ్వనున్నారు. ఈ ప్రక్రియ మార్చి నాటికి పూర్తవుతుంది. ఏప్రిల్‌ నుంచి మొదలయ్యే వైద్య పరీక్షల అనంతరం ప్రతి రోగికి సంబంధించిన సమాచారం ఈ కార్డులో నిక్షిప్తం చేస్తారు. రోగి చిరునామా, వయస్సు, ప్రాంతం, వైద్య పరీక్షల ఫలితాలు, మందుల వివరాలు ఇందులో ఉంటాయి. రోగి ఆస్పత్రికి వెళ్లినప్పుడు ఆ కార్డుపై ఉన్న నెంబరు ఆధారంగా అతని పూర్తి వివరాలు తెలుస్తాయి. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బాధితుల వివరాలు, ఏ ప్రాంతంలో జబ్బుల తీవ్రత ఎక్కువగా ఉంది, ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు అనే విషయాలను సులభంగా తెలుసుకునే వీలు ప్రభుత్వానికి కలుగుతుంది.

ఏఎన్‌ఎం..ఆశా వర్కర్లకు కీలక బాధ్యతలు
కోటి మందికి వైద్య పరీక్షల బాధ్యతలను వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోని సుమారు 16వేల మంది ఏఎన్‌ఎంలు, 40 వేల మంది ఆశా కార్యకర్తలకు అప్పగించనున్నారు. వీరిలో 12 వేల మంది ఏఎన్‌ఎంలు గ్రామీణ ప్రాంతాల్లోనూ, 4 వేల ఏఎన్‌ఎంలు పట్టణ ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తారు. వీరితో పాటు ఆశా కార్యకర్తలు ఉంటారు. ఈ కార్యక్రమంలో ఒక్కో ఆశా కార్యకర్తకు 250 ఇళ్లను కేటాయిస్తారు. అలాగే, ఏఎన్‌ఎం 600 మందిని స్క్రీన్‌ చేయాల్సి ఉంటుంది. రోజుకు 10 మందికి చొప్పున వీరు ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించాలి.

రిస్క్‌ ఫ్యాక్టర్‌ అసెస్‌మెంట్‌ పేరుతో ప్రత్యేకంగా ముద్రించిన పత్రాల ద్వారా కేటాయించిన ఇళ్లకు వెళ్లి వారి వివరాలు నమోదు చేయడంతోపాటు వారిని ఆస్పత్రులకు తీసుకురావడం చేయాల్సి ఉంటుంది. ఎన్‌సీడీ (నాన్‌ కమ్యునికబుల్‌ డిసీజెస్‌) పేరుతో రూపొందించిన ప్రత్యేక యాప్‌లో ఈ వివరాలను అప్‌లోడ్‌ చేస్తారు. ఏఎన్‌ఎం ప్రాథమిక పరీక్షలు నిర్వహించిన అనంతరం వారిని పీహెచ్‌సీకి లేదా జిల్లా ఆస్పత్రులకు.. అవసరమైతే బోధనాసుపత్రులకు మెరుగైన వైద్యం కోసం పంపిస్తారు. ఇలా సెప్టెంబర్‌ 30కల్లా కోటి మందికి వైద్యపరీక్షలు పూర్తిచేసి, అవసరమైన వారికి మందులు ఇవ్వాలనేది సర్కారు ముఖ్యోద్దేశ్యం.

జీవనశైలి జబ్బులను అరికట్టేందుకే..
గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇంటి వద్దకే సిబ్బందిని పంపించి వారి ఆరోగ్య పరిస్థితులు తెలుసుకునే కార్యక్రమాన్ని పెద్దఎత్తున చేపడుతున్నాం. ప్రమాదకరంగా మారిన జీవనశైలి జబ్బులను గుర్తించి, వారికి సకాలంలో వైద్యం చేసేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుంది. ఈ వ్యాధులపై అవగాహన లేని కారణంగా ఎంతోమంది గ్రామీణ పేదలు నష్టపోతున్నారు. ఇలాంటి నష్టం జరగకూడదనే ఈ కార్యక్రమం చేపడుతున్నాం.
– డా. కేఎస్‌ జవహర్‌రెడ్డి, ముఖ్య కార్యదర్శి, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ 

>
మరిన్ని వార్తలు