విజయవాడ, న్యూస్లైన్: ఎంబీబీఎస్/ బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన తొలివిడత మెడికల్ కౌన్సెలింగ్ సోమవారం ముగిసింది. ఎంబీబీఎస్లో 4,080 సీట్లు, బీడీఎస్లో 908 సీట్లు భర్తీ అయ్యాయి. చివరిరోజు జరిగిన కౌన్సెలింగ్కు జేఎన్టీయూ కేంద్రంలో 12 మంది, ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీలో 87 మంది, ఏయూ ఏరియాలో 54 మంది, ఎస్వీ యూనివర్సిటీ కేంద్రంలో 43 మంది అభ్యర్థులు హాజరయ్యారు. స్పెషల్ కేటగిరీ కింద రెండు ఆంగ్లో ఇండియన్ అభ్యర్థుల సీట్లను భర్తీచేశారు. ఈనెల 31లోగా అభ్యర్థులు ఆయా కళాశాలల్లో చేరాలి. ఆగస్టు 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.
3 నుంచి ఓయూలో రెండో విడత పీజీ కౌన్సెలింగ్
ఉస్మానియా యూనివర్సిటీ పీజీసెట్ రెండో విడత కౌన్సెలింగ్ ఓయూ క్యాంపస్లోని పీజీ అడ్మిషన్స్ కార్యాలయంలో ఆగస్టు 3 నుంచి ప్రారంభం కానున్నట్లు డెరైక్టర్ ప్రొఫెసర్ శివరాజ్ తెలిపారు. ఓయూతో పాటు తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయాల్లో మొదటి విడతలో మిగిలిన సీట్లతో పాటు ఎంఏ సైకాలజీ, ఎంఈడీ, ఎంపీఈడీ, వివిధ పీజీ డిప్లొమా కోర్సులకు రెండో విడత కౌన్సెలింగ్ చేపట్టనున్నట్లు తెలిపారు.