మరో మూడు కేంద్రాల్లో మెడికల్ కౌన్సెలింగ్

6 Sep, 2013 05:07 IST|Sakshi

విజయవాడ, న్యూస్‌లై న్: ఎంబీబీఎస్/బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల 12 నుంచి జరగనున్న రెండోవిడత మెడికల్ కౌన్సెలింగ్‌ను హైదరాబాద్‌తోపాటు విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్‌హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.బాబూలాల్ తెలిపారు.  సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలో రెండో విడత మెడికల్ కౌన్సెలింగ్‌ను కేవలం హైదరాబాద్‌లో నిర్వహించేందుకు ఈనెల 2న హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం విదితమే.

 

అయితే రవాణా సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉన్న నేపథ్యంలో వచ్చిన వినతుల మేరకు యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ ఐ.వి.రావు గురువారం ఉద్యోగ సంఘాలతో చర్చించారు. ఇంతకుముందు ప్రకటించినట్లుగా ఈనెల 11న ఉస్మానియా యూనివర్సిటీ  క్యాంపస్‌లోని పీజీఆర్‌ఆర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్‌లో మాత్రమే స్పెషల్ (పీఎంసీ, ఎన్‌సీసీ, ఆర్మీ, పీహెచ్) కేటగిరీ అభ్యర్థులకు కౌన్సెలింగ్ జరుగుతుందని రిజిస్ట్రార్ తెలిపారు. కౌన్సెలింగ్‌కు అందుబాటులో ఉన్న సీట్లు, కళాశాలల వివరాలను గురువారం యూనివర్సిటీ వెబ్‌సైట్ హెచ్‌టీటీపీ://ఎన్‌టీఆర్‌యూహెచ్‌ఎస్.ఏపీ.ఎన్‌ఐసీ.ఇన్‌లో పొందుపరిచారు.

>
మరిన్ని వార్తలు