కొండెక్కిన వైద్యం

25 Aug, 2015 23:56 IST|Sakshi
కొండెక్కిన వైద్యం

వారు అడవి బిడ్డలు..తమకు ఇది కావాలని నోరు తెరిచి అడగలేని అమాయకులు వాళ్లు.. విశాఖ నగరానికి ఆమడ దూరంలో ఉన్నా కనీస సౌకర్యాలకు నోచుకోని అభాగ్యులు. అలాంటి వారికి కనీస అవసరమైన వైద్యం ఏ విధంగా అందుతుందో తెలుసుకోవడానికి ‘సాక్షి’ మంగళవారం క్షేత్ర స్థాయికి వెళ్లింది. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో అందుతున్న వైద్య సేవలు, అక్కడి సమస్యలపై ఆరా తీసింది. ఈ పరిశీలనలో గిరిజనుల దుర్భర పరిస్థితులు వెలుగుచూశాయి. ఆస్పత్రుల్లో లోటుపాట్లు బయటపడ్డాయి.
 
 సాక్షి, విశాఖపట్నం :  ఏజెన్సీలోని 11 మండలాల్లో 36 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. 53 మంది వైద్యులుండాల్సి ఉండగా ఏడుగురు లేరు. ఉన్నవారిలో 18 మంది కాంట్రాక్టు వైద్యులే. ఏరియా ఆస్పత్రులు రెండు ఉన్నాయి. 194ఆరోగ్య ఉపకేంద్రాలున్నాయి. పాడేరు, అరకు, హుకుంపేటలో ప్రసూతి కేంద్రాలున్నాయి. అడిషన్ డిఎంహెచ్‌ఓ ఆధ్వర్యంలో ఐదుగురు సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్లు ఉండాల్సి ఉండగా నలుగురే ఉన్నారు. దంతవైద్యులు ఇద్దరు ఉండాల్సి ఉండగా ఒక్కరే ఉన్నారు. కమ్యూనిటీ హెల్త్ అధికారులు ఎనిమిది మంది ఉండాల్సి ఉండగా ఐదుగురే ఉన్నారు.

మల్టీపర్పస్ హెల్త్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ 29 పోస్టులకు గానూ 20 మంది ఉన్నారు. పబ్లిక్ హెల్త్ నర్స్ పోస్టులు 18 ఉండగా 6 ఖాళీగా ఉన్నాయి. స్టాఫ్ నర్స్ పోస్టులు 58 కాగా 11 ఖాళీగా ఉన్నాయి.ఫార్మాసిస్టు 40 పోస్టులకు 15 మందే ఉన్నారు. ల్యాబ్ టెక్సీషియన్ 34 మంది ఉండాల్సి ఉండగా 30 మంది ఉన్నారు. హెల్త్ సూపర్‌వైజర్ మేల్ 56 పోస్టులకు 43 మంది ఉన్నారు.హెల్త్ సూపర్‌వైజర్ ఫిమేల్ 50 పోస్టులకు 11 పోస్టులు ఖాళీ. హెల్త్ అసిస్టెంట్ మేల్ 194 పోస్టులకు 143 మంది ఉన్నారు. హెల్త్ అసిస్టెంట్ ఫిమేల్ 195 పోస్టులకు 59 ఖాళీగా ఉన్నాయి.సెకండ్ ఏఎన్‌ఎం 194 మందికి 178 మంది ఉండగా 16 ఖాళీ.

ఆశా కార్యకర్తలు 3227 పోస్టులకు 3186 మంది ఉన్నారు. పీహెచ్‌సీల్లో ప్రధానంగా వైద్యుల కొరత వేధిస్తోంది. అరకులోయ మండలంలోని 24 గంటల గన్నెల  పీహెచ్‌సీలో ఇద్దరు డాక్టర్లు ఉండాల్సి ఉండగా ఒకరు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. ఒకరిని డుంబ్రిగుడ పీహెచ్‌సీకి డెప్యూటేషన్‌పై పంపించారు. హుకుంపేట పీహెచ్‌సీలో నలుగురు వైద్యులకు గాను ముగ్గురే పనిచేస్తేన్నారు. పెదబయలులో  పీహెచ్‌సీలో ఇద్దరు వైద్యులు ఉండాల్సి ఉండగా ఒక్కరే ఉన్నారు. ఉన్నవారు కూడా  సమయానికి రాకపోవడంతో వారికోసం నిరీక్షించడం రోగులకు సాధారమైపోయింది.  నర్సులే వైద్యుల అవతారం ఎత్తుతున్నారు.

వారు చేయలేని చికిత్సలకు విశాఖ పెద్దాసుపత్రికి రిఫర్ చేస్తున్నారు.పాడేరు ఆస్పత్రిలో చాలా పరికరాలు వినియోగించక పోవడం వల్ల తుప్పు పట్టి నిరుపయోగంగా ఉన్నాయి. రోగుల కోసం కేటాయించిన గది, వార్డులోని మంచాలు దుమ్ము పట్టాయి. పాడేరులో పేరుకే పది పడకల ఆసుపత్రి కానీ 4పడకలే ఉన్నాయి. ఫార్మాసిస్టులు, ఆరోగ్యమిత్రలు, ఓపీ చీటీ రాసే సిబ్బంది కూడా లేరు. పేరుకే 24 గంటల ఆసుపత్రులు కానీ తురిచి ఉంచేది సాయంత్రం వరకే. వైద్య సిబ్బంది నివాస గృహాలు లేక ప్రయివేటు ఇళ్లులో ఉంటూ విధులు నిర్వర్తిస్తున్నారు. కాంట్రాక్టు డాక్టర్లకు నాలుగు నెలలుగా జీతాలు రావడం లేదు.

మరిన్ని వార్తలు