నేడు మెడికల్‌ షాపుల బంద్‌

28 Sep, 2018 04:10 IST|Sakshi

ఆన్‌లైన్‌లో మందుల అమ్మకానికి వ్యతిరేకంగా నిర్ణయం

దేశవ్యాప్తంగా ఒకరోజు నిరసనకు పిలుపునిచ్చిన కెమిస్ట్‌ అసోసియేషన్‌

రాష్ట్రంలో 35 వేల వరకూ మందుల షాపులు నేడు క్లోజ్‌

సాక్షి, అమరావతి : ఆన్‌లైన్‌లో మందుల విక్రయాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా నేడు మందుల షాపులను మూసివేస్తున్నట్లు డ్రగ్గిస్ట్‌ అండ్‌ కెమిస్ట్‌ అసోసియేషన్‌ ప్రకటించింది. ఆన్‌లైన్‌లో మందుల అమ్మకాలు చేసుకోవచ్చని డ్రగ్‌ అండ్‌ కాస్మొటిక్స్‌ యాక్ట్‌లో చేర్చడం వల్ల ప్రజలకు, ప్రభుత్వానికి కలిగే ఇబ్బందులను తెలియజేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.

దేశవ్యాప్తంగా 8 లక్షల మంది కెమిస్ట్‌లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆల్‌ ఇండియా ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ కెమిస్ట్‌ అండ్‌ డ్రగ్గిస్ట్‌ అసోసియేషన్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లో సీమాంధ్ర డ్రగ్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ (ఎస్‌ఏడీడీఏ)లు మందుల షాపులను మూసివేసి నిరసన తెలియజేయాలని నిర్ణయించాయి. ఆంధ్రప్రదేశ్‌లో 35 వేల షాపులు నేడు మూసివేస్తున్నట్టు సంఘం తెలిపింది.

మందుల షాపుల అభ్యంతరాలు..
ఆన్‌లైన్‌లో మందుల అమ్మకం వల్ల నాసిరక మందులు మార్కెట్లోకి వచ్చే ప్రమాదం ఉంది.
డాక్టర్ల పర్యవేక్షణ లేకుండా మందుల వాడకంతో అనేక దుష్పరిణామాలు తలెత్తుతాయి.
ఇ–ఫార్మసీ ద్వారా మత్తు మందుల వాడకం ఎక్కువై యువత పెడతోవ పట్టే ప్రమాదం ఉంది.
 గర్భ నిరోధకానికి సంబంధించి మందులు సులభంగా లభిస్తే, విచ్చలవిడితనం మరింత పెరుగుతుంది.
♦  యాంటీ బయోటిక్స్‌ మందుల వాడకం పెరిగి వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది.
♦  గ్రామీణ ప్రాంతాల్లో సకాలంలో మందుల లభ్యత కనుమరుగయ్యే ప్రమాదం.
 దేశవ్యాప్తంగా 8 లక్షల మంది కెమిస్ట్‌లు, వారి వద్ద పనిచేస్తున్న 80 లక్షల కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం.

మరిన్ని వార్తలు