ఎంసెట్‌లో ‘అనంత’ జయకేతనం!

22 May, 2015 03:55 IST|Sakshi

యూనివర్సిటీ : ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడిసిన్ ఎంట్రెన్స్ టెస్ట్-2015 ఫలితాలు గురువారం వెల్లడయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఉత్తీర్ణత శాతం పెరిగింది. గత ఎంసెట్ ఉమ్మడిగా నిర్వహించడంతో మార్కులు అధికంగా వచ్చినప్పటికీ, ర్యాంకులు ఆశాజనకంగా లేవు. తాజా ఎంసెట్ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకంగా నిర్వహించడంతో ఉత్తీర్ణతా శాతం పెరగడంతో పాటు ర్యాంకులు మెరుగయ్యాయి. అనంతపురం రీజనల్‌లో ఇంజనీరింగ్8275 మంది దరఖాస్తు చేసుకోగా, 7,890 మంది అభ్యర్థులు ఇంజనీరింగ్ రాత పరీక్షను రాశారు. 6,171 మంది అభ్యర్థులు ఎంసెట్ పరీక్ష అర్హత సాధించారు.

 ఇందులో అబ్బాయిలు 3,502 మంది, అమ్మాయిలు 2,669 మంది ఉన్నారు. 1,425 మంది పూర్తిగా ఎంసెట్‌లో అర్హత సాధించలేదు. 133 మంది ఎంసెట్‌లో అర్హత సాధించినా ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యారు. ఇంజనీరింగ్‌లో అబ్బాయిలు 57 శాతం , అమ్మాయిలు 43 శాతం అర్హత సాధించారు.

 మెడిసిన్‌లో అమ్మాయిలదే హవా:
  మెడిసిన్, అగ్రికల్చర్‌కు 3058కి గాను, 2832 మంది రాత పరీక్షలకు హాజరయ్యారు. 2,544 మంది అర్హత సాధించారు. అబ్బాయిలు 895 మంది, అమ్మాయిలు 1,649 మంది ఉత్తీర్ణులయ్యారు. 118 మంది ఎంసెట్‌లో అర్హత సాధించలేదు. ఇంటర్మీడియట్ మార్కులతో 25 శాతం వెయిటేజీ, ఎంసెట్‌కు కలిపి ర్యాంకులు ప్రకటించారు. మెడిసిన్‌లో 65 శాతం మంది అమ్మాయిలు ర్యాంకులు కైవసం చేసుకోగా, అబ్బాయిలు కేవలం 35 శాతానికి పరిమితయ్యారు.

 25 నుంచి ర్యాంకు కార్డులు:
 ఎంసెట్-2015 ర్యాంకు కార్డుల కోసం ఈ నెల 25 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 12 నుంచి కౌన్సెలింగ్‌ను నిర్వహించనున్నారు. గత ఏడాది ఏర్పడ్డ రాజకీయ అనిశ్చితి, నాన్‌లోకల్ వివాదం దృష్ట్యా కౌన్సెలింగ్ ప్రక్రియ ఆలస్యం కావడంతో అకడమిక్ ఇయర్ ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో పొరుగు రాష్ట్రాల వైపు విద్యార్థులు తరలి వెళ్లారు. తాజాగా జరిగిన ఎంసెట్ పరీక్షలో హాజరుశాతం అధికం కావడం, ఉత్తీర్ణతా శాతం గత ఏడాది కంటే 10 శాతం మెరగు కావడంతో ఇంజనీరింగ్ సీట్లు అనుకున్న స్థాయిలోభర్తీ అవుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. జేఎన్‌టీయూ ,అనంతపురం పరిధిలో రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరులో 118 ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. పులివెందుల జేఎన్‌టీయూ, కలికిరి, జేఎన్‌టీయూ అనంతపురం కళాశాలలు ప్రభుత్వ కళాశాలలతో పాటు మరో పది స్వయం ప్రతిపత్తి కళాశాలలు ఉన్నాయి.

మరిన్ని వార్తలు