మోగనున్న ‘సార్వత్రిక’ నగారా

10 Apr, 2014 00:55 IST|Sakshi
మోగనున్న ‘సార్వత్రిక’ నగారా
  • 12 నుంచి నామినేషన్ల స్వీకరణ
  •  21న పరిశీలన
  •  23న ఉపసంహరణ
  •  నిర్వహణపై అధికారులతో కలెక్టర్ సమీక్ష
  •  విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ఈ నెల 12వ తేదీ నుంచి ప్రారంభమవుతున్న దృష్ట్యా రిటర్నింగ్ అధికారులు భారత ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించి పగడ్బంధీగా విధులు నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ సూచించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆర్వోలతో సమావేశమయ్యారు. అభ్యర్థుల నామినేషన్లు,వాటి పరిశీలన, ఉపసంహరణ, ఇతర అంశాలపై సమీక్షించారు.

    ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 12 నుంచి 19వ తేదీ వరకు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారన్నారు. సెలవు రోజులైన ఈ నెల 13, 14, 18 తేదీల్లో నామినేషన్లను స్వీకరించరాదన్నారు. ఈ నెల 21న నామినేషన్ల పరిశీలన, 23న ఉపసంహరణ ఉంటుందని వివరించారు. రిటర్నింగ్ అధికారులు ప్రతీ నియోజకవర్గానికి పోలింగ్ స్టేషన్ల వారీగా ఓటరు జాబితాను అందుబాటులో ఉంచుకోవాలన్నారు.

    సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్, వీడియోగ్రఫీ విధిగా చేపట్టాలని ఆదేశించారు. అభ్యర్థులు వేసే నామినేషన్ల పత్రాలను జాగ్రత్తగా పరిశీలించి ఎక్కడైనా ఖాళీలు వదిలితే వారికి చెప్పి రాయించాలన్నారు. నామినేషన్లు వేసే అభ్యర్థులు పార్లమెంట్ స్థానానికి రూ.25 వేలు, అసెంబ్లీ స్థానానికి రూ.10 వేలు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు.

    ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అందులో 50 శాతం చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు. అభ్యర్థులు సమర్పించే కులధ్రువీకరణ పత్రాలను జాగ్రత్తగా పరిశీలించాలన్నారు. ఎన్నికలకు పోటీ చేసే అభ్యర్థుల వయస్సు 25 ఏళ్లు పూర్తయి ఉండాలన్నారు. సమావేశంలో జేసీ ప్రవీణ్‌కుమార్, ఐటీడీఏ పీవో వినయ్‌చంద్, డీఆర్వో ఎం.వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
     

>
మరిన్ని వార్తలు