హాజరైన హీరోయిన్లు మెహరీన్, రాశీఖన్నా
పెద్ద ఎత్తున హాజరైన అభిమానులు, నగరవాసులు
తిరుపతి కల్చరల్: తిరుపతి వీవీ మహల్ రోడ్డులో నూతనంగా ఏర్పాటుచేసిన సీఎంఆర్ షాపింగ్మాల్ ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. టీటీడీ తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు, టీటీడీ సీవీఎస్ఓ గోపీనాథ్జెట్టి, తుడా కార్యదర్శి మాధవీలత, జీఎస్టీ డెప్యూటీ కమిషనర్ చంద్రశేఖర్రెడ్డి, గౌరవ అతిథులుగా హాజరై షాపింగ్ మాల్ మొదటి బ్లాక్ను ప్రారంభించారు. ప్రముఖ హీరోయిన్లు మెహరీన్, రాశీఖన్నాలు ప్రత్యేక అతిథులుగా హాజరై మాల్ రెండవ బ్లాక్తో పాటు జ్యువెలరీ కలెక్షన్స్ను జ్యోతి ప్రజ్వలన చేసి ఆరంభించారు. వారు మాట్లాడుతూ ఆధ్యాత్మిక నగరంలోని ప్రజలకు సీఎంఆర్ షాపింగ్మాల్ను అందుబాటులోకి తీసుకురావడం సంతోషకరమన్నారు. ఆధునిక హంగుల పోకడల ఫ్యాషన్ దస్తులు, సంప్రదాయ దుస్తులతో పాటు ఆధునిక డిజైన్ల బంగారు ఆభరణాలు మాల్లో లభ్యమవుతాయన్నారు. సీఎంఆర్ షాపింగ్ మాల్ అధినేతలు చందన మోహన్రావు, మావూరి వెంకటరణ మాట్లాడుతూ సుదీర్ఘ అనుభవంతో జిల్లాలోనే అతి పెద్ద షాపింగ్ మాల్ను ఏర్పాటుచేశామన్నారు. వీవీ మహల్ ప్రొప్రయిటర్ పురంధర్, పసుపర్తి సూపర్ మార్కెట్ చైర్మన్ పసుపర్తి రఘురామ్ పాల్గొన్నారు.
‘ఐలవ్ యూ తిరుపతి’
సీఎంఆర్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన సినీతారలు మెహరీన్ , రాశిఖన్నా నగరంలో సందడి చేశారు. అభిమానులనుద్దేశించి మాట్లాడుతూ ‘ఐ లవ్యూ తిరుపతి’ అంటూ అభిమానులను ఉత్సాహపరిచారు. మెహరీన్ మాట్లాడుతూ సంక్రాంతికి ఎఫ్–2 సినిమాతో మీ ముందుకు వస్తున్న తనను ఆదరించాలని కోరారు. రాశీఖన్నా మాట్లాడుతూ తిరుపతి అభిమానులు చూపుతున్న ఆదరణ మరువలేనిదన్నారు. సినీ తారలను చూసేందుకు అభిమానులు సీఎంఆర్ షాపింగ్ మాల్ వద్ద గుమిగూడారు. హీరోయిన్లతో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు.