‘నా దృష్టిలో వారంతా వీర సైనికులు‘

21 Mar, 2020 19:48 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఇంటి నుంచి పని చేసే వారికి అంతరాయం కలగకుండా ఇంటర్ నెట్ సదుపాయం కల్పిస్తున్నట్లు పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రకటించారు. 'కరోనా' కట్టడికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందస్తు పకడ్బంది చర్యల నేపథ్యంలో మంత్రి సూచనతో టెలికం, ఇంటర్ నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఏపీలో కరోనా వ్యాప్తి చెందకుండా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలలో భాగంగా ఇంటర్ నెట్ సదుపాయంపై మంత్రి గౌతమ్ రెడ్డి ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్‌తో చర్చించి పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కోవిడ్-19 వైరస్ నివారణకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోందని తెలిపారు. (క్యాస్టింగ్‌ కౌచ్‌పై పెదవి విప్పిన అనుష్క)

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశమంతా రేపు(ఆదివారం) 'జనతా కర్ఫ్యూ'కి సిద్ధమవుతోందన్నారు. ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తోన్న ఉద్యోగులు, విద్యార్థులు, ఐటీ ఉద్యోగులకు ఏ ఇబ్బంది కలగకుండా 24 గంటల ఇంటర్ నెట్ సౌకర్యాన్ని అందించాలని సూచించారు. సామాజిక దూరం పాటిస్తూనే కీలకమైన విధులు నిర్వహించే ప్రతి ఒక్కరికీ టెలికమ్ సేవలు కూడా అంతరాయం కలగకుండా చూడాలని మంత్రి తెలిపారు. వారి ప్లాన్‌లకు అనుగుణంగా ఇంటర్ నెట్, టెలికమ్ సేవలను తప్పనిసరిగా అందించేలా చూడాలని మంత్రి స్పష్టం చేశారు. అందుకోసం ఫీల్డ్ లెవల్‌లో పని చేసే సిబ్బందిని సిద్ధంగా ఉంచుకుని ఎలాంటి సాంకేతిక కారణాల వలన ఇబ్బంది కలగకుండా చూడాలని తెలిపారు. (కరోనా : గూగుల్ స్పెషల్‌ వెబ్‌సైట్‌ )

కోవిడ్-19 వైరస్ వ్యాప్తి చెందకుండా చూడడంలో ప్రతి పౌరుడి బాధ్యత ఉందని అన్నారు. భారత జాతిని రక్షించేందుకు సరిహద్దుల్లో సమరం చేసే జవాన్లతో సమానంగా కరోనాపై యుద్ధం చేసే వారంతా తన దృష్టిలో వీరసైనికులని మంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. వ్యాధి వ్యాప్తిపై అవగాహన కలిగి, బాధ్యతగా, నియమ నిబంధనలకు అనుగుణంగా అందరూ తమ కర్తవ్యాన్ని పూర్తి చేయాలని సూచించారు. (జనతా కర్ఫ్యూ: పెట్రోల్‌ బంక్‌లు బంద్‌ )

>
మరిన్ని వార్తలు