మతిస్థిమితం లేని యువకుడి హల్‌చల్‌

4 Jan, 2020 12:07 IST|Sakshi
యువకుడిని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తున్న ప్రజలు

కత్తితో చేతులు,గొంతు కోసుకున్న వైనం

పరుగులు తీసిన ప్రజలు

స్థానికుల సాయంతో పట్టుకుని ఆస్పత్రికి తరలించిన పోలీసులు

కర్నూలు, ఆదోని టౌన్‌: పట్టణంలోని కోర్టు ప్రాంగణంలో ఓ యువకుడు శుక్రవారం హల్‌చల్‌ చేశాడు. కత్తితో తనను తాను గాయపరుచుకుంటూ, కేకలు వేస్తూ బీభత్సం సృష్టించాడు. యువకుడి చేతిలో కత్తి చూసిన ప్రజలు భయంతో పరుగులు తీశారు. కోర్టు పనిమీద అక్కడికి వచ్చిన కొందరు పోలీసులు స్థానికుల సాయంతో యువకుడిని పట్టుకుని ఆస్పత్రికి తరలించడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. టూ టౌన్‌ సీఐ అబ్దుల్‌ గౌస్‌ తెలిపిన వివరాలు.. ఉత్తరప్రదేశ్‌ గోరక్‌పూర్‌ గౌలు బజార్‌కు చెందిన యువకుడు సుభాష్‌ సోంకార్‌ కొంతకాలంగా మానసిక వ్యాధితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం రైలులో నుంచి స్థానిక రైల్వే స్టేషన్‌లో దిగాడు.

సమీపంలోని కోర్టు ఆవరణలోకి ప్రవేశించాడు. తన వద్దనున్న కత్తితో చేతులు, గొంతు కోసుకున్నాడు. తనకు బతికేందుకు అర్హత లేదంటూ, తనను గొంతు కోసి చంపాలంటూ స్థానికుల వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేశాడు. కోర్టు డ్యూటీపై వచ్చిన పోలీసులు స్థానికుల సాయంతో పట్టుకుని అంబులెన్స్‌లో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్య సిబ్బంది, పోలీసుల సాయంతో యువకుడి చేతులు, కాళ్లు కట్టేసి వైద్యులు వైద్యం చేశారు. పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు రెఫర్‌ చేశారు. కాగా జేబులోని ఫోన్‌బుక్‌ ఆధారంగా గోరక్‌పూర్‌లోని యువకుడి భార్య సుమాంధురి, కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని సీఐ తెలిపారు.

>
మరిన్ని వార్తలు