అర్ధరాత్రి వేళ వ్యక్తి కిడ్నాప్‌

15 Jul, 2018 09:27 IST|Sakshi

ఇంట్లోకి చొరబడి బలవంతంగా తీసుకెళ్లిన వైనం 

భార్యా, బిడ్డల ఆక్రందన

నెల్లూరు (వీఆర్సీసెంటర్‌): ఇంట్లో నిద్రిస్తున్న ఓ వ్యక్తిని గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు అర్ధరాత్రి వేళ బలవంతంగా కిడ్నాప్‌ చేశారు. ఈ ఘటన నగరంలోని వెంకటేశ్వరపురం నేతాజీనగర్‌లో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. స్థానికులు, కుటుంబ సభ్యుల కథ నం మేరకు.. నేతా జీనగర్‌ పాత లెట్రిన్ల సమీపంలో ఎస్‌కే మస్తాన్, గౌసియా దంపతులు నివాసం ఉంటున్నారు. మస్తాన్‌ నగరంలోని బృందావనంలో కృష్ణ అనే స్కూటర్‌ మెకానిక్‌ వద్ద పని చేస్తున్నాడు. మస్తాన్‌ శుక్రవారం రాత్రి  పని నుంచి వచ్చి, భోజనం చేసి నిద్రించాడు. అర్ధరాత్రి సుమారు 12.30 గంటల  సమయంలో ఇంటి వెనుక వైపు ఉన్న తలుపునకు బయట వైపు గడియ పెట్టిన ముగ్గురు వ్యక్తులు ప్రధాన గేటు వద్దకు వచ్చి తలుపు తట్టారు.

 తలుపు తీసిన గౌసియాను మీ భర్తను పిలవమని చెప్పడంతో ఆమె మస్తాన్‌ను పిలిచింది. నిద్ర నుంచి లేచి మస్తాన్‌ వచ్చి ఎవరు కావాలి అని అడిగే లోపే గుర్తుతెలియని ముగ్గురు మస్తాన్‌ను బలవంతంగా తీసుకెళ్లారు. పది నిమిషాల తర్వాత వారిలో ఒక వ్యక్తి తిరిగి మస్తాన్‌ ఇంట్లోకి వచ్చి మస్తాన్, అతని భార్య గౌసియా సెల్‌ఫోన్లు తీసుకెళ్లాడు. ఈ పరిణామాల నుంచి తేరుకున్న గౌసియా తమ బంధువులకు, తెలియజేయటంతో శనివారం ఉదయం నవాబుపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

 అయితే కిడ్నాప్‌ చేసిన వ్యక్తులు ఎవరనేది తెలియడం లేదు. మస్తాన్‌కు ఇతరులతో ఎలాంటి తగాదాలు లేవని చెబుతున్నారు. అర్ధరాత్రి కిడ్నాప్‌నకు గురైన మస్తాన్‌ కోసం భార్య గౌసియా, పిల్లలు నాయబ్‌రసూల్, నస్రీన్‌ విలపిస్తున్నారు. విషయం తెలుసుకున్న మస్తాన్‌ పనిచేసే యజమాని కృష్ణ, మస్తాన్‌ బంధువులు గాలిస్తున్నారు.

మరిన్ని వార్తలు