కొత్త పార్టీ నేను పెట్టినా కిరణ్ పెట్టినా ఒకటే: రాయపాటి

28 Oct, 2013 03:44 IST|Sakshi
కొత్త పార్టీ నేను పెట్టినా కిరణ్ పెట్టినా ఒకటే: రాయపాటి

సాక్షి, చెన్నై ప్రతినిధి: కొత్త పార్టీపై డిసెంబర్ తర్వాత నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ ఎంపీ రాయపాటి సాంబశివరావు చెప్పారు. ఆయన ఆదివారమిక్కడ మాట్లాడుతూ, టీడీపీలోకి వెళ్లే ఆలోచన ప్రస్తుతానికి తనకు లేదని, కాంగ్రెస్‌లోనే ఉన్నానని చెప్పారు. కొత్త పార్టీని తాను పెట్టినా, కిరణ్ పెట్టినా ఒకటేనని అన్నారు.

రాష్ట్ర విభజనకు అనుకూలంగా తమ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని బహిరంగంగానే వ్యతిరేకిస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి కొత్త పార్టీ పెడతారని వార్తలు వస్తున్నాయి. డిసెంబర్ లో ఆయన సొంత కుంపటి పెట్టుకునే అవకాశముందని సీఎం సన్నిహిత వర్గాలే అంటున్నట్టు సమాచారం.

కాగా, రాయపాటి టీడీపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఢిల్లీలో దీక్ష చేసిన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు ఆయన సంఘీభావం తెలపడంతో ఈ ప్రచారానికి బలం లభించింది. అయితే ఇప్పుడే టీడీపీలో చేరే ఆలోచన రాయపాటికి లేదని ఆయన  మాటలను బట్టి తెలుస్తోంది.

మరిన్ని వార్తలు