కంపించిన జనం

22 May, 2014 01:18 IST|Sakshi
కంపించిన జనం

 విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్ : జిల్లాలో పలుచోట్ల బుధవారం రాత్రి 9.55 నుంచి 10 గంటల సమయంలో మూడు సెకన్ల పాటు భూమి స్వల్పంగా కంపించింది.  నిద్రకు ఉపక్రమిస్తున్న వేళ  భూ ప్రకంపనలు రావడంతో అందరూ తీవ్ర ఆందోళన చెందారు.  సెకన్ల కాలం భూమి కంపించినా ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇళ్లలోని వంట సామగ్రి, కప్‌బోర్డ్‌లలోని వస్తువులు పడిపోవడంతో ఉలిక్కిపడ్డారు. ఎన్నడూ లేని విధంగా దాదాపు జిల్లావ్యాప్తంగా భూమి కంపించింది.  బంగాళాఖాతంలో ఏర్పడిన భూ కంపం ప్రభావంతో జిల్లాలోని విజయనగరం, పార్వతీపురం, బొ బ్బిలి, సీతానగరం, గుర్ల, నెల్లిమర్ల, గరివిడి, చీపురుపల్లి, గజపతినగ రం ప్రాంతాలతో పాటు భోగాపురం, పూసపాటిరేగ ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న వసంతవిహార్ అపార్ట్‌మెంట్, తోటపాలెం, అయ్యన్నపేట జంక్షన్, కామాక్షినగర్ ప్రాంతాల్లో ప్రజలు భయాందోళనతో బయటకు పరుగు లు తీశారు. బొబ్బిలిలోని సాయినగర్ కాలనీ, గొల్లపల్లి, ఐటీఐ, పూల్ బాగ్ కాలనీల్లో భూమి కంపించింది. ఇళ్లల్లోని చిన్న చిన్న సామాన్లు కిందకు పడడంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. పార్వతీపురంలోని జనశక్తి కాలనీతో పాటు శివారు కాలనీల్లోనూ భూమి స్వల్పంగా కంపించింది.
 
 కురుపాం మండలంలో మొండెంఖల్, గుమ్మడి, నీలకంఠాపురం తదితర గ్రామాల్లోనూ, నెల్లిమర్ల మండంలోని నెల్లిమర్ల, జరజాపుపేట ప్రాంతాల్లో కూడా భూమి స్వల్పంగా భూమి కంపించింది. వేసవి కావడంతో ఈ ప్రాంతాల్లోని ప్రజలు  మేడపై పడుకున్నారు. ఇంతలో స్వల్ప ప్రకంపనలు రావడంతో ఆందోళనతో పలువురు పరుగుపరుగున కిందకు దిగిపోయారు. జరజాపుపేటలో కాస్త అధికంగా ప్రకంపనలు వ చ్చినట్టు స్థానికులు తెలిపారు. చీపురుపల్లి పట్టణంలోని అగ్రహారం, స్థానిక ఓంశాంతి భవనం సమీపంలోనూ భూమి స్వల్పం గా కంపించడంతో స్థానికులు ఆందోళన చెందారు. పోతాయవలసలో కూడా భూమి కంపించినట్టు స్థానికులు తెలిపారు. మెరకముడిదాం మండలంలోని మెరముడిదాం, సోమలింగాపురం, గర్భాం, ఉత్తరావల్లి తదితర గ్రామాల్లో కూడా భూ ప్రకంపనలు వచ్చాయి.జేసీ ఆరా: జిల్లాలోని భూ ప్రకంపనలపై జాయింట్ కలెక్టర్ బి. రామారావు అధికారులను ఆరా తీశారు. ఎక్కడెక్కడ భూమి కంపించిందో అధికారులను అడిగి తెలుసుకున్నారు.  
 

మరిన్ని వార్తలు