కరువు ఓడించింది...పాడి గెలిపించింది

17 Aug, 2015 10:29 IST|Sakshi

కుర్లపల్లి(కనగానపల్లి): వరుస కరువులు కర్షక కుటుంబాలను ఛిద్రం చేశాయి. అ యినా మనో స్థైర్యం కోల్పోని రైతులు ప్రత్యామ్నాయంగా పాడిని ఎంచుకున్నారు. క్షీరవిప్లవం సాధించి ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అనంతపురం జిల్లా కనగానపల్లి మండలంలోని కుర్లపల్లి గ్రామానికి చెంది న రైతు రామిరెడ్డి కుమారులు ఆదినారాయణరెడ్డి, గోపాల్‌రెడ్డిలకు 20 ఎకరాల పొలం ఉంది.గత ఐదు సంవత్సరాలుగా సక్రమంగా వర్షాలు రాక మెట్ట భూమిలో పంటలు చేతికందలేదు. దీంతో తరి పొలంలో లక్షల రూపాయలు వ్యయం చేసి 20 బోర్లు వేయించా రు. వర్షాలు రాక  వాటిలో కూడా నీరు అడుగంటింది.


ఈ పరిస్థితుల్లో వారి దృష్టి పాడి రంగంపై పడింది. మొదట నాలుగు పాడి ఆ వులను (జెర్సీ జాతి) కొనుగోలు చేసి పోషణ ప్రారంభించారు. కొంత ఆదాయం రావడంతో తిరిగి మరో ఎనిమిది పాడి అవులను కొనుగోలు చేశారు. ఒక బోరుబావిలో అరకొరకగా వస్తున్న నీటితో ఎకరం పొలంలో పశుగ్రాసం పెంచారు.  ప్రస్తుతం వారి వద్ద ఉన్న 10 పాడి ఆవుల ద్వారా  రోజుకు 80 లీటర్ల పాలు ఉత్పత్తి చేస్తున్నారు. లీటరు 20 రూపాయల ప్రకారం ప్రైవేటు డెయిరీలకు విక్రయిస్తున్నారు. రోజుకు రూ. 1600, నెలకు రూ.50 వేలు ఆదాయం అందుతోంది. పశువుల దాణా, వట్టిగడ్డి, వైద్యం, మందులకు నెలకు రూ. 20 వేల దాకా ఖర్చు అవుతుందని, ఇవి పోనూ నెలకు రూ. 30 వేల వరకు ఆదాయం వస్తుందని రైతులు తెలిపారు.  ప్రభుత్వం డెయిరీలు ఏర్పాటుచేసి పాలను కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పిస్తే నెలకు మరో రూ. 10 వేల ఆదాయం పెరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
 
పంటలు పండక తీవ్రంగా నష్టపోయాం
వర్షాభావంతో నాలుగు సంవత్సరాల నుంచి పంటలు పండక తీవ్రంగా నష్టపోయాం. అప్పులు చేసి  20 బోర్లు వేయించినా నీరు పడలేదు. దీంతో వేరుశనగ, దోశ, కాయగూరల పంటలు చేతికందక నష్టపోయాం. మూడు సంవత్సరాల నుంచి వ్యవసాయాన్ని వదలేసి పాడి ఆవులను పోషించుకుంటూ ఆదాయాన్ని గడిస్తున్నాం.గడ్డి కొరత లేకపోలే మరింత ఆదాయం పొందవచ్చు.
 -బి.ఆదినారాయణరెడ్డి, యువరైతు, కుర్లపల్లి గ్రామం, కనగానపల్లి మండలం, అనంతపురం జిల్లా.
 

మరిన్ని వార్తలు