రోగాల‘పాలు’

13 Dec, 2013 00:29 IST|Sakshi

 మానవుని వినియోగానికి హానికరైమైన రీతిలో కల్తీ పాల ఉత్పత్తి, విక్రయాలు జోరుగా జరుగుతున్నాయి. ఈ కల్తీ పాలు తాగడం వల్ల మనిషి అనేక రుగ్మతలకు గురవుతున్నాడు. ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమబెంగాల్ ప్రభుత్వాలు కల్తీ పాలు విక్రయిస్తే యావజ్జీవ శిక్షార్హమైన నేరంగా మార్చడం శుభ పరిణామం. మిగిలిన రాష్ట్రాలు కూడా కల్తీ పాల ఉత్పత్తి, విక్రయాలపై అదే విధానాన్ని అనుసరించేందుకు చట్టంలో తగిన సవరణలు తీసుకురావాలి.
 - రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు
 ఇచ్చిన ఆదేశాలు
 
 మంచిర్యాల అర్బన్, న్యూస్‌లైన్ :
 అమృతానికి పర్యాయ పదం పా లు. మానవ మనుగడకు పాలతో సంబం ధం ఎంతో ఉంది. ఆరోగ్యం మాట అ టుంచితే ఇప్పుడు పాలు తాగితే ఆస్పత్రిలో చేరడం గ్యారంటీ అనే పరిస్థితి నెలకొంది. కల్తీ పాల ఉత్పత్తి, విక్రయాలపై రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేస్తూ ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అవగతమవుతోంది. అసలే చలికాలం.. ఆపై తెల్లవారగానే ఎవరైనా ముందుగా కోరుకునేది గరగరం చాయ్. వినియోగదారుల బలహీనతను ఆసరా చేసుకుంటున్న పలువురు వ్యాపారులు జిల్లాలో కల్తీ పాల వ్యాపారాన్ని యథేచ్ఛగా సాగిస్తున్నారు. జిల్లా అధికార యంత్రాంగం నిద్రమత్తులో జోగుతుండడంతో వ్యాపారుల కల్తీకి అడ్డులేకుండా పోతోంది. దీంతో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల నుంచి పెద్ద మొత్తంలో కల్తీ పాలు జిల్లాకు దిగుమతి అవుతున్నాయి.
 
 ఉత్పత్తి తక్కువ... వాడకం ఎక్కువ?
 జిల్లా జనాభా 27.41 లక్షలు. జిల్లాలో ఒకప్పటి జనాభాకు అనుగుణంగా పాల శీతల కేంద్రాలను ప్రభుత్వం 11 ఏర్పాటు చేయగా అందులో ఆరు మూత పడ్డాయి. ఆదిలాబాద్, కడెం, భైంసా, లక్సెటిపేట, చెన్నూర్‌లలో పాల కేంద్రాలు నామమాత్రంగా పనిచేస్తున్నాయి. పాల శీతల కేంద్రాలతోపాటు పాడి పరిశ్రమలు, ఇండ్లలో కలిపి లెక్కిస్తే 10 వేల లీటర్ల పాలు ఉత్పత్తి జరుగుతోంది. ఇతర జిల్లాల నుంచి మరో పది వేల లీటర్లు దిగుమతి అవుతున్నాయి. దీనిద్వారా జిల్లాలో రోజుకు 20 వేల లీటర్ల పాలు అమ్మకాలు జరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. పెద్ద, చిన్న, మధ్య తరహా హోటళ్లలో టీ,కాఫీ,  స్వీట్ హౌజ్, పెరుగు, ఇండ్లలో పాల వాడకం లెక్కిస్తే మరింత ఎక్కువగానే అమ్మకాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. డిమాండ్‌కు తగ్గట్టు ఉత్పత్తి లేకపోవడంతో పలువురు వ్యాపారులు కల్తీ చేస్తూ విక్రయిస్తున్నారు
 .
 పాల కల్తీ ఇలా..
     లీటర్ పాలను మూడు లీటర్లుగా తయారు చేస్తున్నారు. కొంత మంది నీళ్లు కలుపుతున్నారు. ఇలా జిల్లాలో కల్తీ వ్యాపారం 60 శాతం జరుగుతోం 25 గ్రాముల స్కిమ్ మిల్క్ పౌడర్‌ను వినియోగించి పాలు తయారుచేస్తున్నారు.     కాల్షియం కార్బొనెట్, ఎముకల పొడి, రసాయనాలు కలుపుతున్నారు. పాలు తెల్లగా ఉండడానికి యూరియా, సర్ఫ్, చిక్కగా ఉండడానికి పెయింట్ వేస్తున్నారు.
 
 కల్తీ ఎందుకంటే...
 కొవ్వు, రెండోది కొవ్వులేనివిగా పాలు రెండు రకాలుంటాయి. కొవ్వులేని పాలల్లో ల్యాక్టోజ్, ప్రొటీన్, మినరల్ పదార్థాలు ఉంటాయి. వీటిని పెంచడానికి కల్తీ చేస్తున్నారు. సహజ సిద్ధమైన కొవ్వులేని పాలల్లో ల్యాక్టోజ్ 4 నుంచి 4.5శాతం, ప్రొటీన్‌లో 4 నుంచి 4.5, మినర ల్స్‌లో 0.8 శాతం ఉంటాయి. వీటిలో కాస్టిక్ సోడా, యూరియా, చక్కెర కలిపితే మినరల్, ప్రోటీన్, ల్యాక్టోజ్ శాతం పెరుగుతాయి.
 
 ప్రయోజనాలు
 పాలల్లో కొవ్వు పదార్థాలు 4 శాతం ఉంటాయి. 4.9 శాతం కార్బొహైడ్రెడ్‌లు, 3.35 శాతం ప్రొటీన్‌లు, 0.75 నీటి శాతం ఉంటాయి. మానవ శరీరానికి ఎంతో ఉపయోగకరమైన ఏ,బీ,డీ విటమిన్లు సమృద్ధిగా లభిస్తాయి.
 
 అనారోగ్య సమస్యలు
 కల్తీ పాలు తాగడంతో అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. గ్యాస్‌ట్రిక్, అల్సర్, క్షయ, మూత్ర పిండాలు, ఊపిరితిత్తులు, రోగ నిరోధక శక్తి తగ్గడం, పేగులు చెడిపోవడంలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
 
 కల్తీని ఇలా గుర్తించాలి..
 కల్తీ పాలను గుర్తించడం సులభతరం. కల్తీ బాగా జరిగితే పాల వాసన, రంగు మారుతాయి. వాసన పెరుగులా మారుతుంది. కల్తీ జరిగిన వెంటనే వేడి చేస్తే విరిగిపోతాయి. గది ఉష్ణోగ్రత అనువుగా లేకపోతే 6 గంటల్లో విరిగిపోతాయి. ఫ్రిజ్‌లో పెడితే 12 గంటల్లో విరిగిపోతాయి. లాక్టోమీటర్ ద్వారా పాత సాంధ్రత, నాణ్యతను తెలుసుకోవచ్చు.
 
 తనిఖీలు శూన్యం..
 జిల్లాలో కల్తీ పాల విక్రయం జోరుగా సాగుతున్నా.. పట్టణాల్లోని ప్రజారోగ్య విభాగం, ఆహార కల్తీ నిరోధక శాఖ కనీస చర్యలు చేపట్టడంలేదు. పాలను పరిశీలించి అందులోని కల్తీని గుర్తించాల్సిన బాధ్యతలను విస్మరిస్తున్నారు. రోజూ వందలాది లీటర్లలో పాలు కల్తీ జరుగుతున్నా ఒక్క కేసైనా నమోదు కాకపోవడం వారి పనితీరుకు అద్దం పడుతోంది.

మరిన్ని వార్తలు