పెంకుటింటికి లక్షల కోట్లకు లంకె!

1 Feb, 2017 08:36 IST|Sakshi
పెంకుటింటికి లక్షల కోట్లకు లంకె!

సాక్షి ప్రతినిధి, అమరావతి బ్యూరో : నిజమే మరి.. ఈ పెంకుటింటికి లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేశాయని చెబుతున్న విశాఖ భాగస్వామ్య సదస్సుకు లింకు ఉంది. ఎందుకంటే ఆ లక్షల కోట్ల ఎంవోయూల్లో ఈ పెంకుటింటికీ భాగస్వామ్యముంది. పక్కనున్న చిత్రంలో సాక్షాత్తు ముఖ్యమంత్రితో ఎంవోయూ కుదర్చుకుంటున్న వ్యక్తి ఉండేది ఇక్కడే!!

 ఈయన పేరు దొడ్డాల సుధీర్‌. సీఐఐ సదస్సులో ముఖ్యమంత్రితో ఎంవోయూ కుదుర్చుకుంటున్నాడని ఈయనో  పారిశ్రామికవేత్త అనుకునేరు. కనీసం ఓ చిన్న కంపెనీకి షేర్‌ హోల్డర్‌ కూడా కాదు. గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం సంతగుడిపాడుకు చెందిన దొడ్డాల చిట్టిబాబు, కోటేశ్వరమ్మ ఏకైక కుమారుడు దొడ్డాల సుధీర్‌. పాత పెంకుటిల్లుతోపాటు గ్రామంలో కొద్దిపాటి వ్యవసాయ భూమి ఆయనకున్న ఆస్తి. భార్య అంగన్‌వాడీ టీచర్‌.

లక్షల కోట్లు వచ్చాయని నమ్మించాలని..
ఈవీఎం కాలేజీలో సుధీర్‌ పీఆర్వోగా పనిచేస్తూ ఇంటర్మీడియెట్, ఇంజినీరింగ్‌ విద్యార్థులను కాలేజీలో చేర్చించి కమీషన్లు తీసుకుంటుండేవారు. రెండేళ్ల క్రితం నరసరావుపేట మండలం కోటప్పకొండ సమీపంలో విరించి టౌన్‌షిప్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీ భూములు కొనుగోలు చేసి రియల్‌ ఎస్టేట్‌ వాళ్లు ప్లాట్లు వేసి అమ్మకాలు మొదలు పెట్టారు. ఈ కంపెనీలో సుధీర్‌ ప్లాట్లు విక్రయించేందుకు ఏజెం ట్‌గా చేరారు. కమీషన్లే ఆధారం. కానీ రూ.కోట్లు పెట్టుబడులు పెట్టడానికి వీలుగా ప్రభుత్వంతో కుదిరిన అవగాహనా ఒప్పందం మీద సంతకం చేశారు.

రూ.కోట్లాది సొమ్ము ఎలా తెస్తారో అని స్థాని కులు చర్చించుకుంటున్నారు. ఇంతకూ అసలు సంగతేంటంటే భారీ సంఖ్యలో ఎంవోయూలపై సంతకాలు చేయడానికి కంపెనీలను తీసుకురావాలని ప్రభుత్వ పెద్దలు మొదట అధికారులకు పురమాయించారు. ఎవరూ ముందుకు రాకపోవడంతో ఎంవోయూల మీద సంతకాలు చేయడానికి మనుషులను సమకూర్చే బాధ్యతను ప్రైవేట్‌ కంపెనీకి అప్పగించిం ది. వారు సమకూర్చిన వారిలో సుధీర్‌ ఒకరు. ఇలాంటి వారు, ఊరూపేరు లేని కంపెనీలు  ఎన్నో ఉన్నాయి.