ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్
సాక్షి, నెల్లూరు: చంద్రబాబు ఒక అబద్ధం చెబితే.. లోకేష్ పది చెబుతున్నారని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్ మండిపడ్డారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ...వరదలు ముంచెత్తి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా.. వారిని పరామర్శించకుండా ట్వీట్లకే పరిమితమయ్యారని విమర్శించారు. పడవను అడ్డుపెట్టి చంద్రబాబు ఇంటిని ముంచివేశారనే లోకేష్ వాఖ్యలు అజ్ఞానానికి నిదర్శనం అని దుయ్యబట్టారు. నెల్లూరు నగరంలో పేదల ఇళ్లు తొలగించే ప్రసక్తే లేదని మంత్రి అనిల్ స్పష్టం చేశారు.
సీఎం జగన్ పారదర్శక విధానాలతో పారిశ్రామిక వేత్తలు హర్షం:
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పారదర్శక విధానాలతో పారిశ్రామిక వేత్తలు సంతోష వ్యక్తం చేస్తున్నారని మంత్రి అనిల్ తెలిపారు. పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగాలు కల్పించడానికి చట్టం తీసుకురావడం పట్ల హర్షిస్తున్నారని చెప్పారు. నిరుద్యోగులకు శిక్షణనిచ్చి ఉద్యోగాలు కల్పిస్తామని పేర్కొన్నారు. పరిశ్రమలకు సంబంధించిన అవసరాలకు నీటిని అందిస్తామని వెల్లడించారు. శ్రీశైలం నుంచి రికార్డుస్థాయిలో ఒకే రోజు 2.4 టీఎంసీల నీటిని సోమశిల జలాశయానికి తీసుకువచ్చామని తెలిపారు. వరద నీటిని పూర్తిస్థాయిలో ఉపయోగించుకుంటామని తెలిపారు.