'ఆ విషయం కృష్ణా జిల్లాలో అందరికీ తెలుసు'

17 May, 2020 18:06 IST|Sakshi

సాక్షి, నెల్లూరు: పోతిరెడ్డిపాడుపై టీడీపీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదంటూ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ ప్రశ్నించారు. ఆదివారం రోజున నెల్లూరు జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా బూతులు మాట్లాడేది టీడీపీ నేతలే. చంద్రబాబు ఎక్కడున్నా పోతిరెడ్డిపాడుపై ఆయన వైఖరేంటో స్పష్టం చేయాలి. దేవినేని ఉమాతో పాటు టీడీపీ నేతలు పోతిరెడ్డిపాడుపై ఎందుకు మాట్లాడటం లేదు. టీడీపీ మౌనం వహించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సీఎం జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో మొట్టమొదటిసారిగా సోమశిల జలాశయంలో 78 టీఎంసీల నీరు నిల్వ చేసిన చరిత్ర మా ప్రభుత్వానిది. ఈ సారి 9 లక్షల ఎకరాలకు మొదటి పంటకు నీరు ఇచ్చాం. 2 లక్షల 70వేల ఎకరాలకు రెండో పంటకు నీరు ఇస్తున్నాం. అందులో అనుమానాలు ఉంటే నెల్లూరు జిల్లాలోని టీడీపీ నేతలను అడిగి తెలుసుకోండి. చదవండి: బాబు వాడకం ఎలా ఉంటుందంటే..!

పోలవరం విషయంలో తప్పుడు లెక్కలు మాట్లాడవద్దు. పోలవరం అంటే ప్రాజెక్ట్‌తో పాటు పునరావాసం కూడా ఉంది. వైఎస్సార్‌ హయాంలోనే పోలవరం ప్రారంభమైంది. టీడీపీ హయాంలో కాంట్రాక్లర్ల నుంచి ఎంత వసూలు చేశారో అందరికీ తెలుసు. ఐదేళ్లు కూడా ఉమా కాంట్రాక్టర్లను, అధికారులను అడ్డగోలుగా వాడుకున్నారు. నేను ఏ కాంట్రాక్టర్‌ను కూడా కలవలేదు. పదవుల కోసం నీవు ఎవరిని చంపావనే విషయం కృష్ణా జిల్లాలో అందరికీ తెలుసు' అంటూ మంత్రి అనిల్‌ దేవినేని ఉమాపై ధ్వజమెత్తారు. చదవండి: డాక్టర్‌ సుధాకర్‌ టీడీపీ మనిషి: ఎంపీ సురేష్‌

మరిన్ని వార్తలు