చంద్రబాబు అహంకారానికి ఇది నిదర్శనం: మంత్రి

23 Jul, 2019 16:33 IST|Sakshi

ప్రతిపక్షం వాకౌట్‌ చేయడం దురదృష్టకరం

నెల్లూరు జిల్లాకు తొలిసారి బీసీ మంత్రి

సభలో మంత్రి అనిల్‌కుమార్‌

సాక్షి, అమరావతి: దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత నెల్లూరు జిల్లాకు తొలిసారి బీసీ వ్యక్తికి మంత్రిపదవి అవకాశం దక్కిందని.. ఈ ఘనత సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే చెందుతుందని మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ అన్నారు. వెనుకబడిన వర్గాల వారిని అభివృద్ధి చేసేందుకు.. బీసీ బిల్లును ప్రవేశపెట్టడం శుభపరిణామన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంత్రి అనిల్‌ సభలో మాట్లాడుతూ.. 50శాతానికి పైగా బీసీ, ఎస్సీలకు అవకాశం కల్పిస్తూ.. దేశంలో తొలిసారి సామాజిక మంత్రిమండలిని ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. గత 40 ఏళ్ల నుంచి బీసీలకు ఉద్దరిస్తున్నట్లు గత పాలకులు డప్పుకొట్టారని.. కానీ వారికి ఒరిగింది ఏమీలేదని విమర్శించారు. బీసీలంతా గౌరవంగా బతకాలని, వారి అభివృద్ధికి సీఎం గొప్ప కృషి చేస్తున్నారని అభినందించారు.

సభలో మంత్రి అనిల్‌ మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి గొప్ప బిల్లును స్వాగతించాల్సిన ప్రతిపక్షం వాకౌట్‌ చేయడం దురదృష్టకరం. ఇది చంద్రబాబు అహంకారానికి నిదర్శనం. బిల్లు ప్రవేశపెడుతుంటే తల ఎక్కడపెట్టుకోవాలో తెలియక చంద్రబాబు నాయుడు సభ నుంచి బయటకు వెళ్లి దాక్కున్నారు. ఇలాంటి ప్రతిపక్షం దేశ చరిత్రలో ఎక్కడా లేదు. ఎన్నికలకు నాలుగు నెలల సమయం ఉందనితెలిసి.. ముస్లింకు మంత్రివర్గంలో చోటిచ్చారు. తమ ప్రభుత్వం తొలి కేబినెట్‌లో వెనుకబడిన వర్గాల వారికి 50శాతం అవకాశం కల్పిస్తూ.. సామాజిక మంత్రిమండలిని ఏర్పాటుచేశాం’’ అని అన్నారు.


సీఎం వైఎస్‌ జగన్‌ మంత్రం: రోజా
అన్ని అవకాశాల్లో మహిళలకు సగభాగం కల్పించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని ఆర్‌కే రోజా అన్నారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాల్లో చర్చలో భాగంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి మహిళను గౌరవిస్తూ.. అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించిన సీఎంకు ఆమె కృతజ్ఞత తెలిపారు. మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే మహిళలను అభివృద్ధి పథంలో నడిపించే విధంగా చారిత్రాత్మక బిల్లును తీసుకురావడం గొప్ప విషయమన్నారు. గత ప్రభుత్వం కేవలం ఓట్లు, సీట్లు కోసమే వారిని వాడుకున్నారని రోజా మండిపడ్డారు. సీఎం వైఎస్‌ జగన్‌ మంత్రం ఎస్సీ, ఎస్టీ,బీసీ మైనార్టీల అభివృద్ధి అని అన్నారు. 

మహిళా విప్లవానికి ఏపీ అసెంబ్లీ వేదిక అయిందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే విడదల రజనీ అన్నారు. అమ్మఒడి పథకం ద్వారా రాష్ట్రంలో 43 లక్షల మంది లబ్ధిపొందుతున్నారని తెలిపారు. మహిళా విప్లవానికి ఈ బిల్లే ఉదాహరణ అని అభినందించారు.

మరిన్ని వార్తలు