బ్యాలెన్స్‌డ్‌ బడ్జెట్‌ రూపొందిస్తున్నాం : మంత్రి బుగ్గన

21 Jun, 2019 19:57 IST|Sakshi
ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి

సాక్షి, న్యూఢిల్లీ : నవరత్నాల అమలే తమ ప్రభుత్వ ప్రాధాన్యత అని ఆర్థిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి అన్నారు. ప్రభుత్వ ధన దుర్వినియోగాన్ని అరికట్టి హామీలను పక్కాగా అమలు చేస్తామని పేర్కొన్నారు. శుక్రవారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రెండు లక్షల కోట్ల రూపాయల రేంజ్‌లో రాష్ట్ర బడ్జెట్‌ ఉంటుందని తెలిపారు. జీఎస్టీ వచ్చిన తర్వాత కొత్త ఆదాయ మార్గాలు తగ్గిపోయాయని.. అయితే జీఎస్టీ నుంచి కూడా క్రమేణా ఆదాయం పెరుగుతోందని పేర్కొన్నారు. అన్ని వర్గాలను పరిగణనలోకి తీసుకుని సమతౌల్యమైన బడ్జెట్‌ రూపొందిస్తున్నామని వెల్లడించారు.

కేంద్రానికి విన్నవించాం..
‘ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని,  సాయం చేయాలని కేంద్రాన్ని కోరాం. రాజధాని నిర్మాణానికి, పోలవరానికి సరిపడా నిధులు కేటాయించాలని విఙ్ఞప్తి చేశాం. పీఎం కిసాన్ నిధి నుంచి ఆరువేల రూపాయల మొత్తాన్ని పెంచాలని కోరాం. రైతులకు, స్వయం సహాయక బృందాలకు ఇచ్చే సున్నా వడ్డీ భారం కూడా కేంద్రమే భరించాలని విన్నవించాం. మూడు వారాల్లోగా సమతౌల్యమైన బడ్జెట్‌ను మీరు చూస్తారు. అవినీతి రహిత పరిపాలనే మా ధ్యేయం. చిత్తశుద్ధితో రాష్ట్ర అభివృద్ధి కోసం పని చేస్తున్నాం’ అని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు