సచివాలయం సాక్షిగా మంత్రి జవహర్‌ కోడ్‌ ఉల్లంఘన

13 Mar, 2019 04:00 IST|Sakshi

రాజకీయ విమర్శలకు వేదికగా మంత్రి చాంబర్‌

సాక్షి, అమరావతి: అధికార తెలుగుదేశం పార్టీ యథేచ్ఛగా ఎన్నికల కోడ్‌ ఉల్లంఘిస్తోంది. తాజాగా ఎక్సైజ్‌ శాఖ మంత్రి కేఎస్‌ జవహర్‌ మంగళవారం సచివాలయాన్ని ప్రత్యర్థి పార్టీలను తిట్టిపోయడానికి వేదికగా వినియోగించడం ద్వారా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో ముఖ్యమంత్రితో సహా మంత్రులెవరూ ప్రభుత్వ కార్యాలయాలు, మంత్రుల చాంబర్లను రాజకీయ అవసరాల కోసం వినియోగించకూడదు.

కానీ జవహర్‌ వీటిని పట్టించుకోకుండా సచివాలయంలోని నాలుగో బ్లాక్‌లో ఉన్న తన చాంబర్‌లో విలేకరుల సమావేశం పెట్టి మరీ ప్రత్యర్థి పార్టీలపై దుమ్మెత్తిపోశారు. దీనికి ఎదురుగానే ఐదో బ్లాక్‌లో రాష్ట్ర ఎన్నికల కార్యాలయం, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఉండటం గమనార్హం. అయినా దీన్ని లెక్కచేయని మంత్రి తన కార్యాలయంలో విలేకరుల సమావేశం పెట్టి ప్రతిపక్ష నేత జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ప్రస్తుత కొవ్వూరు స్థానాన్ని మార్పు చేస్తున్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. నియోజకవర్గం మారే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.  

మరిన్ని వార్తలు