బకాయిలను విడుదల చేయాలి

18 Feb, 2020 16:32 IST|Sakshi

కేంద్రాన్ని కోరిన మంత్రి కొడాలి నాని

సాక్షి, ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ఎఫ్‌సిఐ నుంచి రావాల్సిన నాలుగు వేల కోట్లు బకాయిలు త్వరితగతిన విడుదల చేయాలని కేంద్రాన్ని కోరినట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తెలిపారు.మంగళవారం ఢిల్లీలో ఆయన కేంద్ర ఆహార శాఖ మంత్రి రాంవిలాస్‌ పాశ్వాన్‌ కలిశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం 92 లక్షల కార్డులను మాత్రమే గుర్తించిందని.. మొత్తం 1.30 కోట్ల కార్డులను గుర్తించాలని కేంద్రమంత్రిని కోరామని వెల్లడించారు.ఎఫ్‌సిఐ గోడౌన్‌లలో ధాన్యం నిల్వలను ఖాళీ చేయాలని విజ్ఞప్తి చేశామని పేర్కొన్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన బియ్యాన్ని నిల్వ చేయడానికి గోడౌన్‌ల అవసరముందని చెప్పారు. ప్రస్తావించిన పలు సమస్యలపై కేంద్ర మంత్రి రాంవిలాస్‌ పాశ్వాన్‌ సానుకూలంగా స్పందించారని మంత్రి కొడాలి నాని వెల్లడించారు.

మార్గదర్శకాలు సడలింపు..
రేషన్‌కార్డుల జారీకి గతంలో మార్గదర్శకాలను సడలించి మరింత ఎక్కువ మందికి వచ్చేలా నిబంధనలను సరళీకృతం చేశామని మంత్రి నాని చెప్పారు. ప్రత్యేకంగా ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కార్డులు ఇవ్వడం వల్ల తమకు రేషన్‌ అవసరం లేదని స్వచ్ఛందంగా 9 లక్షల మంది కార్డులను వెనక్కి ఇచ్చేశారని పేర్కొన్నారు. ‘ఆరు లక్షల కార్డులపై ఎంక్వయిరీ జరుగుతోంది. వాటిపై తనిఖీ చేసి అర్హులందరికీ ఇస్తాం. ఎక్కువ మంది లబ్ధిదారులు ఉండాలని లక్ష్యంతో నిబంధనలు  సడలించాం. రేషన్ కార్డుల జారీ  అనేది నిరంతర ప్రక్రియ’ అని పేర్కొన్నారు.

చంద్రబాబుకు శిక్ష తప్పదు..
చంద్రబాబు అవినీతి బాగోతంపై మంత్రి నాని మాట్లాడుతూ.. రెండు వేల కోట్ల రూపాయల డబ్బును ఎవరు ఇంట్లో పెట్టుకుని కూర్చోరని, వేల కోట్ల అక్రమ సంపాదన చేశారు కాబట్టి.. వాటికి సంబంధించిన ఆస్తులు, నగదు, డాక్యుమెంట్లకు సంబంధించిన వివరాలు దొరికాయన్నారు. రెండు వేల కోట్లు దొరికాయని ఎవరు చెప్పలేదన్నారు. కోట్ల రూపాయలు పీఏ ఇంట్లో పెట్టుకోవడానికి చంద్రబాబు పిచ్చోడు కాదని.. ఆయన చెప్పిన మేరకు డబ్బులు ఇచ్చిన విషయాన్ని పీఏ శ్రీనివాస్‌ తన డైరీలో రాసుకున్నారన్నారు. చంద్రబాబు చేసిన అక్రమాలకు శిక్ష తప్పదని పేర్కొన్నారు.(అవినీతికి బ్రాండ్‌ అంబాసిడర్‌ అడ్డంగా దొరికారు..)

శాసనమండలి అభివృద్ధికి అడ్డుపడుతోంది..
కేంద్రం, రాష్ట్రానికి మధ్య రాజ్యాంగ సంబంధాలు ఉన్నాయని.. తమకు మండలి వద్దని ఫార్వర్డ్‌ చేశామని మంత్రి నాని పేర్కొన్నారు. రెండు,మూడు నెలల లోపు కేంద్రం నిర్ణయం అమలవుతుందన్నారు. ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాల్సిన శాసనమండలి అభివృద్ధి అడ్డుపడుతుందని..రాజకీయాలకు వేదికగా మారుతోందని విమర్శించారు. అందుకే మండలిని రద్దుకు అసెంబ్లీ తీర్మానం చేసిందన్నారు.

మరిన్ని వార్తలు