చంద్రబాబు ధోరణి ఆక్షేపణీయం

24 Mar, 2020 15:51 IST|Sakshi

మంత్రి కురసాల కన్నబాబు

సాక్షి, విశాఖపట్నం: కరోనాను ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు రాజకీయానికి వాడుకుంటున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. విశాఖలో కరోనా నివారణ చర్యలపై ఏపీ మంత్రులు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న బాబు వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు ధోరణి ఆక్షేపణీయం అని మండిపడ్డారు. కరోనాపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతి రెండు గంటలకొకసారి సమీక్ష చేస్తున్నారని పేర్కొన్నారు. చిలర్ల రాజకీయాలు మానుకోవాలని చంద్రబాబుకు కన్నబాబు హితవు పలికారు.
(‘లాక్‌డౌన్‌ ఉల్లంఘనులను ఉపేక్షించొద్దు’)

ప్రచారం కంటే పనికే ప్రాధాన్యత..
తాము ప్రచారం కంటే పని చేయడానికే ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు.విశాఖలో మాస్క్‌ల కొరత ఉన్నట్టు గుర్తించామని.. మాస్క్‌లు అందుబాటులో ఉంచడానికి చర్యలు చేపడతామని తెలిపారు. విశాఖలో అనవసర రాకపోకలు ఎక్కువగా ఉన్నాయని.. సాయంత్రం నుంచి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతు బజార్లను తరలించి.. ఆరుబయటే కూరగాయలు,నిత్యావసరాలు విక్రయించేలా చర్యలు చేపడతామని పేర్కొన్నారు. మీడియాకు ఎలాంటి ఆంక్షలు లేవని స్పష్టం చేశారు. (కరోనా: నిబంధనల అతిక్రమణ.. నడిరోడ్డుపై..)

ఆ బాధ్యత ప్రభుత్వానిదే: అవంతి శ్రీనివాస్‌
ప్రజలకు భద్రత కల్పించడమే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం లక్ష్యమని పర్యాటక శాఖ మంత్రి అవంతి  శ్రీనివాస్‌ అన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. నిత్యావసరాలు పూర్తి స్థాయిలో అందించే బాధ్యత ప్రభుత్వానిదేనని తెలిపారు. పేదలకు ఎలాంటి మేలు చేయాలో ప్రతిదీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. పేదలను పూర్తిస్థాయిలో ఆదుకుంటామని చెప్పారు. కరోనా మహమ్మారిని నియంత్రించేందుకే ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించిందని..ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అవాస్తవాలను ప్రచారం చేయొద్దని మీడియాకు వినతించారు. అవసరం లేకుండా ప్రజలు రోడ్లపైకి రావొద్దని సూచించారు.నిత్యావసరాలను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిత్యావసర వస్తువుల కొరత లేదని.. అన్ని అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. దుకాణాలు పూర్తిగా మూసివేస్తారన్న వదంతులను నమ్మొద్దని అవంతి శ్రీనివాస్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు