అక్కసుతో రాజకీయాలు చేయొద్దు..

7 Sep, 2019 14:34 IST|Sakshi

నాటుసారాను అరికట్టడంలో సీఎం వైఎస్‌ జగన్‌ సఫలం

ఎక్సైజ్‌,వాణిజ్య శాఖ పన్నుల శాఖ మంత్రి కె.నారాయణ స్వామి

సాక్షి, విజయవాడ: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం ఆదాయం కోసం పనిచేసే ప్రభుత్వం కాదని..ప్రజా సంక్షేమమే ప్రధానమని అని ఎక్సైజ్‌,వాణిజ్య శాఖ పన్నుల శాఖ మంత్రి కె.నారాయణ స్వామి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించి.. కేవలం ఆదాయమే లక్ష్యంగా పనిచేసిందని మండిపడ్డారు. నాటుసారాను పూర్తిగా అరికట్టేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఇంత వరకూ కాపు సారా కాసే వారిపైన మాత్రమే కేసులు పెట్టేవారని...వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సారా నిర్వాహకులపైనా కేసులు నమోదు చేస్తున్నామని తెలిపారు. నాటుసారాను అరికట్టడంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సఫలమయ్యారన్నారు. ముఖ్యమంత్రికి పేరు వస్తుందనే అక్కసుతో ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయన్నారు. పత్రికలు, మీడియా మద్యపాన నిషేధంపై అవగాహన కల్పిస్తూ..ప్రభుత్వానికి సహకారం అందించాలని కోరారు. మద్యం లేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని తెలిపారు. మద్యపానం వల్ల కలిగే దుష్ర్పభావాలను పాఠ్యాంశాలలో పొందుపరుస్తామని వెల్లడించారు.

కమర్షియల్ ట్యాక్స్ అధికారులతో మంత్రి సమీక్ష..
వాణిజ్య పన్నుల శాఖ అధికారులతో శనివారం మంత్రి నారాయణ స్వామి సమీక్ష నిర్వహించారు. రిటర్న్‌ ఫైలింగ్‌పై రివ్యూ చేశామని మంత్రి తెలిపారు. ప్రతి జిల్లాలో ఆన్ లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించాలన్నారు. ఫిజికల్ వెరిఫికేషన్ చేసి.. అనుమతులు ఇస్తే  బోగస్ సంస్థలు ఉండవని తెలిపారు. ఇబ్బందులు కలగకుండా పాత బకాయిల కోసం ఒన్ టైం సెటిల్మెంట్ చేయాలని భావిస్తున్నామని తెలిపారు. ఐదు వేల కోట్లకు సంబంధించి కోర్టు కేసులు ఉన్నాయని.. న్యాయ నిపుణులతో చర్చిస్తామని వెల్లడించారు.

మరిన్ని వార్తలు