మండలిలో రాజేంద్రప్రసాద్‌ అసభ్య వ్యాఖ్యలు

10 Dec, 2019 12:13 IST|Sakshi

మంత్రులకు కొమ్ములొచ్చాయి: రాజేంద్ర ‍ప్రసాద్‌

అభ్యంతరం వ్య​క్తం చేసిన మంత్రులు

ఇమాం, మౌజన్లకు ఇళ్ల స్థలాలు: డిప్యూటీ సీఎం

సాక్షి, అమరావతి: శాసనమండలిలో గ్రామ సచివాలయాలపై వాడీవేడి చర్చ సాగింది. ఈ సందర్భంగా టీడీపీ సభ్యుడు రాజేంద్రప్రసాద్ అభ్యంతరకర రీతిలో వ్యాఖ్యలు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు కొమ్ములొచ్చాయని అన్నారు. రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలపై మంత్రులు పెద్దిరెడ్డి, కన్నబాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజేంద్రప్రసాద్‌ది టీవీ చర్చల్లో అరే.. ఒరే అని బూతులు తిట్టించుకునే సంస్కృతి అని ఎద్దేవా చేశారు. సభలో ఆయన చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని మంత్రులు డిమాండ్ చేశారు.

అనంతరం మండలిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ..  గ్రామ వాలంటీర్లు, సచివాలయాల ద్వారా 4లక్షల 50వేల పైగా ఉద్యోగాలు ఇవ్వడం దేశంలో ఇదే ప్రథమం అని అన్నారు. ‘స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇంత భారీస్థాయిలో ఉద్యోగాలు‌ ఏ ముఖ్యమంత్రి ఇవ్వలేదు. గ్రామ సచివాలయాలను ఎప్పుడో ఏర్పాటు చేశామని చంద్రబాబు చెబుతున్నారు. మరి సచివాలయ వ్యవస్థను ఎందుకు అమలు చెయ్యలేదు. గ్రామ సచివాలయాల వ్యవస్థల వల్ల సర్పంచ్‌ల అధికారాలు దెబ్బతింటాయని టీడీపీ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. సర్పంచులు, ఎంపీపీలు, జడ్పీటీసీల అధికారాలను జన్మభూమి  కమిటీలు హరిస్తే ఎందుకు మాట్లాడలేదు’ అని ప్రశ్నించారు.


హజ్ భవన్ స్థలం కోసం అన్వేషణ:  డిప్యూటీ సీఎం
మండలిలో డిపప్యూటీ సీఎం అంజాద్‌ బాషా మాట్లాడుతూ.. ఇమాంలు, మౌజన్లకు 2020 మార్చిలో ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని తెలిపారు. ‘ 9వేలమంది ఇమాంలు, 9వేల మంది మౌజన్ లు ఉన్నారు. గ్రామ వాలంటీర్ల ద్వారా ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తులను తీసుకుంటున్నాం. విజయవాడలో హజ్ భవన్ పేరుతో చంద్రబాబు శంఖుస్థాపన చేశారు. తర్వాత పట్టించుకోలేదు. చంద్రబాబు శంఖుస్థాపన చేసిన హజ్ భవన్ కు రెండు వైపులా శ్మశానాలు ఉన్నాయని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. హజ్ భవన్ కోసం స్థలాన్ని అన్వేషిస్తున్నాం. చంద్రబాబు ప్రభుత్వం 5వేలమంది ఇమాంలు, మౌజన్ లకే గౌరవ వేతనం అందించారు. మేము అర్హులైన అందరికీ గౌరవ వేతనం ఇస్తాం. వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని అన్యాక్రాంతం కాకుండా కాపాడుతాం’ అని అన్నారు.

మరిన్ని వార్తలు