టోల్‌గేట్‌ వద్ద మంత్రి భార్య హల్‌చల్‌

17 May, 2019 23:18 IST|Sakshi

సాక్షి, మాడ్డులపల్లి : ‘నేను మంత్రి భార్యను. నా కారుకే టోల్‌ ఫీజు అడుగుతారా’అంటూ ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు భార్య హల్‌చల్‌ చేశారు. అద్దంకి –నార్కట్‌పల్లి జాతీయ రహదారిపై నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండల కేంద్రంలో ఉన్న టోల్‌ప్లాజా వద్ద ఆంధ్రప్రదేశ్‌ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు భార్య, కుటుంబ సభ్యులు శుక్రవారం సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించారు. మంత్రి భార్య తన కారులో హైదరాబాద్‌ నుంచి గుంటూరుకు వెళ్తున్నారు. మాడ్గులపల్లి టోల్‌ప్లాజా వద్ద టోల్‌ రుసుము చెల్లించాలని సిబ్బంది ఆమె కారును ఆపారు. దాంతో ఆమె ‘నేను మంత్రి భార్యను. ఎమ్మెల్యే స్టిక్కర్‌ ఉంది’అని చెప్పారు. కానీ స్టిక్కర్‌ అనుమతి కాలపరిమితి దాటిందని, టోల్‌ రుసుము చెల్లించకుంటే కారు వేళ్లేది లేదని టోల్‌ప్లాజా సిబ్బంది తేల్చి చేప్పారు. స్టిక్కర్‌ గడువు ముగియడం, కారులో ఎమ్మెల్యే లేకపోవడంతో టోల్‌ప్లాజా సిబ్బంది ఆర్‌అండ్‌బీ రూల్స్‌ ప్రకారం టోల్‌ రుసుము చెల్లించాలని చెప్పారు. మంత్రి భార్య, కుటుంబ సభ్యులు అరగంట సేపు టోల్‌ప్లాజా సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. చివరికి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పీఏ ఫోన్‌ చేసి చెప్పినా వారు అనుమతి ఇవ్వకపోవడంతో టోల్‌ రుసుము చెల్లించి వెళ్లారు. మంత్రి భార్య నిర్వాకంతో టోల్‌ప్లాజా వద్ద ట్రాఫిక్‌ జామైంది.  
సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వార్తలు