మంత్రి రావెల రాజీనామా చేయాలి

7 Mar, 2016 02:48 IST|Sakshi
మంత్రి రావెల రాజీనామా చేయాలి

 పీసీసీ ప్రధాన కార్యదర్శి ఆకుల

విజయవాడ(వన్‌టౌన్) : మైనార్టీ మహిళపై అత్యంత కిరాతకంగా ప్రవర్తించిన మంత్రి రావెల కిషోర్‌బాబు తనయుడు సుశీల్‌ను కఠినంగా శిక్షించాలని పీసీసీ ప్రధాన కార్యదర్శి ఆకుల శ్రీనివాసకుమార్ డిమాండ్ చేశారు. అలాగే తన కుమారుడిని ప్రోత్సహించి మహిళలపై ఏమాత్రం గౌరవం లేని రావెల తక్షణం తన మంత్రి పదవికి రాజీనామా చేయాలన్నారు. ఈ మేరకు నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక పంజా సెంటర్‌లో ఆదివారం సాయంత్రం ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో ఆకుల శ్రీనివాసకుమార్ మాట్లాడుతూ రావెల సుశీల్ పట్టపగలు మహిళపై అఘాయిత్యానికి పాల్పడటం అత్యంత దుర్మార్గమన్నారు. సుశీల్‌ను ఆ విధంగా పెంచిన మంత్రి బలమైన సాక్ష్యాలు ఉన్నా ఇంకా తన కుమారుడు నిర్దోషి అనడం అతని దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. ఇటీవల రాజధానిలో అసైన్డ్ భూములు కొనుగోలు చేసి పేదల పొట్టలు కొట్టిన మంత్రి దానినీ సమర్ధించుకున్నారని గుర్తు చేశారు. పీసీసీ మైనార్టీ నేతలు బషీర్ అహ్మద్, అన్వర్, హుస్సేన్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు