తప్పు చేశారు కాబట్టే.. మొహం చాటేశారు..

17 Feb, 2020 17:44 IST|Sakshi

చంద్రబాబు, లోకేష్‌ పై మంత్రి  శ్రీరంగనాథ రాజు ఫైర్‌

సాక్షి, పశ్చిమగోదావరి: ఐటీ సోదాలపై ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ ఎందుకు మౌనంగా ఉన్నారో సమాధానం చెప్పాలని మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు డిమాండ్‌ చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అవినీతి అక్రమాలపై ఐటీ శాఖ ప్రెస్‌ నోట్‌ విడుదల చేయడంతో రాత్రికి రాత్రే వారు హైదరాబాద్‌కు వెళ్లిపోయారన్నారు. రోజుకు పదిసార్లు ఎల్లో మీడియాలో మాట్లాడే చంద్రబాబు, లోకేష్‌ నేడు మొహం చాటేశారని.. తప్పు చేశారు కాబట్టే వారు మీడియా ముందుకు రాకుండా తమ  నాయకులతో మాట్లాడిస్తున్నారని విమర్శించారు.('మౌనంగా ఉంటే నేరాన్ని అంగీకరించినట్లేగా')

చంద్రబాబు ఐదు కంపెనీలను ఏర్పాటు చేసి సబ్‌ కాంట్రాక్ట్స్ ద్వారా నిధులు మళ్లించి అవినీతికి పాల్పడ్డారన్నారు. మాజీ పీఎస్‌ శ్రీనివాస్‌ వద్ద రెండు లక్షల నగదు మాత్రమే ఐటీ శాఖకు లభ్యమైందంటూ ఎల్లో మీడియా అసత్య ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఐటీ శాఖ పూర్తిస్థాయి దర్యాప్తులో అన్ని బయటకు వస్తాయని పేర్కొన్నారు. చట్టాలకు ఎవరూ అతీతులు కారని.. చట్టం ముందు అందరూ సమానమేనని తెలిపారు. కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనాన్ని చంద్రబాబు స్వప్రయోజనాలు కోసం వాడుకున్నారని మంత్రి శ్రీరంగనాథ రాజు ధ్వజమెత్తారు.

అక్రమాలు..టీడీపీ అవినీతికి నిదర్శనం..
ఐటీ దాడుల్లో వేలకోట్ల అక్రమాలు వెలుగు చూడటం.. టీడీపీ పాలనలో జరిగిన అవినీతికి నిదర్శనమని మంత్రి తానేటి వనిత అన్నారు. తీగ లాగితే డొంక మాత్రమే కదిలిందని.. ఇంకా  లక్షల కోట్ల అవినీతి బాగోతం బయటపడాల్సి ఉందన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై సీబీఐతో విచారణ జరిపించాలని మంత్రి వనిత డిమాండ్‌ చేశారు.
(ఐటీ ఉచ్చులో అవినీతి చక్రవర్తి)

మరిన్ని వార్తలు