సీఎం జగన్‌ చిత్రపటానికి పాలాభిషేకం

15 Dec, 2019 10:34 IST|Sakshi

సాక్షి, విజయవాడ: మహిళల భద్రత కోసం ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ చట్టంపై హర్షం వ్యక్తం చేస్తూ విజయవాడ 31వ డివిజన్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి మహిళలు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఏ రాష్ట్రంలో లేనివిధంగా మహిళల భద్రత కోసం సీఎం వైఎస్‌ జగన్‌ దిశ యాక్ట్ తీసుకువచ్చారని, మహిళలకు అండగా నిలవాలన్న కృతనిశ్చయంతో ఆయన ఈ చట్టం తెచ్చారని కొనియాడారు. మహిళలపై వ్యక్తిగత దూషణలకు దిగినా, కించపరిచినా ఈ కఠిన చట్టం వర్తిస్తుందని తెలిపారు.

దిశ తరహా ఘటనలు మన రాష్ట్రంలో జరగకుండా సీఎం వైఎస్‌ జగన్‌ ఈ చట్టం తీసుకువచ్చారని, దిశ ఘటన జరిగిన రాష్ట్రంలో సైతం ఈ చట్టం చేయడానికి ధైర్యం చేయలేదని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఈ చట్టం తీసుకురావాలని ప్రధాన మత్రి నరేంద్రమోదీకి మహిళలు లేఖ రాశారని గుర్తుచేశారు. సీఎం జగన్‌ ముందుచూపుతో ఈ చట్టం తెచ్చారని, అర్ధరాత్రి సైతం మహిళలు రాష్ట్రంలో స్వేచ్ఛగా ఉండేందుకు  ఈ చట్టం ఉపకరిస్తుందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలు జగన్నకు జేజేలు కొడుతున్నారని తెలిపారు. చంద్రబాబు ఈ చట్టాన్ని స్వాగతించిన పరిస్థితి కనబడలేదని, సహకరిస్తానని చెప్తూనే ఆయన అనేక వంకలు పెట్టారని విమర్శించారు. తెలుగుదేశం నాయకులకు మహిళలు అంటే గౌరవం లేదన్నారు.

కారు షెడ్డులో ఉండాలి మహిళలు వంటింట్లో ఉండాలి అన్న నాయకులు ఆ పార్టీ వారని గుర్తు చేశారు. టీడీపీ మాజీ ఎంపీ మురళీమోహన్ సైతం గతంలో మహిళలు వేసుకునే దుస్తులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని అన్నారు. ఆడపిల్ల కనబడితే ముద్దు అయినా పెట్టాలి, లేదా కడుపు అయినా చేయాలి అన్న అంటూ ఆ పార్టీ ఎమ్మెల్యే పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. దేశంలోని మహిళలందరూ జగన్న వైపు చూస్తున్నారని అన్నారు. సోషల్ మీడియాలో మహిళల పట్ల అసభ్య పోస్టులు పెట్టెవారికి సైతం కళ్లెం వేసేలా ఈ చట్టం తీసుకొచ్చామని, స్పెషల్ కోర్టుల ద్వారా  21 రోజుల్లో కేసు విచారణ పూర్తి చేసి దోషులను శిక్ష పడేలా ఈ చట్టం రూపుదిద్దుకోవడం శుభపరిణామం అని అన్నారు. అంతకుముందు విజయవాడ  31వ డివిజన్‌లో  పర్యటించిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు.. డివిజన్‌లో ప్రజా సమస్యలను అడిగితెలుసుకున్నారు. రెండున్నర కోట్ల రూపాయలతో 31వ డివిజన్ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని తెలిపారు.

మరిన్ని వార్తలు