ఏడాది పాలనపై చర్చకు సిద్ధం..

24 May, 2020 17:00 IST|Sakshi

దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌

సాక్షి, విజయవాడ: టీటీడీ ఆస్తులను ప్రభుత్వం అమ్మేస్తుందంటూ ఎల్లోమీడియా దుష్ప్రచారం చేస్తోందని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. టీడీపీ హయంలో టీటీడీ  చైర్మన్‌గా ఉన్న చదలవాడ కృష్ణమూర్తి, సభ్యులుగా భాను ప్రకాష్‌రెడ్డి వున్నప్పుడే టీటీడీలో ఉపయోగం లేని భూములను వేలం వేసేలా ఒక కమిటీ వేశారని తెలిపారు. గతంలోనే 50 రకాల ఆస్తులను అమ్మాలని గుర్తించారని.. ఈనాడు, ఆంధ్రజ్యోతి ఆరోజు ఎందుకు ప్రశ్నించలేదని దుయ్యబట్టారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయం తప్పుగా కనిపించలేదా? అంటూ వెల్లంపల్లి ప్రశ్నించారు.
(టీటీడీ భూములపై దుష్ప్రచారం మానండి)

మంచిని సేకరిస్తాం..చెడును ఉపేక్షించం..
‘‘తన పాలనలో దేవుళ్ల  గుళ్లను కూల్చివేసిన నీచుడు చంద్రబాబు. సీఎం జగన్ వచ్చాక టీటీడీలో ఏదో జరిగి పోతోందని బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. టీటీడీ ఆస్తులు అమ్మితే సీఎం జగన్‌, వెల్లంపల్లికి గాని ఒక్కరూపాయి కూడా రాదు. చంద్రబాబులా చీకటి జీవోలు ఇచ్చి అమ్మే ఆలోచన సీఎం జగన్‌కు లేదు. చంద్రబాబులా సదావర్తి భూములు దొంగచాటుగా వేలం వేయాలని నిర్ణయించలేదు. చంద్రబాబులా దోచుకోవాలనే ఆలోచన సీఎం జగన్‌కు లేదు. గత ప్రభుత్వం చేసిన వాటిలో మంచిని సేకరిస్తాం, చెడును ఉపేక్షించమని వెల్లంపల్లి స్పష్టం చేశారు. తాము పవన్‌కల్యాణ్‌లా ఫామ్ హౌస్‌లో తాగి  పడుకోవడంలేదని ఆయన విమర్శించారు.
(అప్పుడు సీబీఐ గుర్తుకు రాలేదా..?)

అవినీతిని సీఎం జగన్‌ తరిమికొట్టారు..
‘‘దేవాదాయశాఖ మంత్రి  రంజాన్ తోఫా ఎలా పంచుతారని అంటున్నారు. మొదట నేను ఎమ్మెల్యేను తర్వాత మంత్రిని. నియోజకవర్గంలో అన్ని మతాల వారికి అండగా ఉంటాం. ప్రజలు కష్టాల్లో ఉన్నపుడు ఆదుకున్న వాడే నిజమైన నేత’’ అని ఆయన పేర్కొన్నారు.  టీడీపీ ఐదేళ్ల పాలనపై, తమ ప్రభుత్వ ఏడాది పాలనపై చర్చకు సిద్ధమని ఆయన సవాల్‌ విసిరారు. అవినీతిని సీఎం జగన్ తరిమికొట్టారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు