పెళ్లికాకుండానే తల్లిని చేశాడు

8 Mar, 2015 01:06 IST|Sakshi

 ఏలూరు (వన్ టౌన్) :మైనర్ బాలికపై అత్యాచారం జరిపిన ఓ యువకుడు పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆమె గర్భం దాల్చిన విషయం తెలిసి ముఖం చాటేశాడు. తనకు న్యాయం చేయాలంటూ ఆ బాలిక దీనంగా ఆర్థిస్తోంది. మహిళా దినోత్సవం రోజున వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.  గణపవరం మండలం వెంకట్రాజుపురం గ్రామం నిరుపేద కూలీ కుటుంబానికి చెందిన ఓ బాలిక తాడేపల్లిగూడెంలో ఇంటర్మీడియెట్‌లో చేరింది. కొన్ని రోజులకే తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లి గ్రామానికి చెందిన చిన్న చినబాబు అనే యువకుడు 2013లో ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ఇంటర్మీడియెట్ చదివిన అతడు పెయింటింగ్ పనులు చేస్తున్నాడు. బాలికతో స్నేహంగా ఉంటూ ఒక రోజు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. కలిసి మెలిసి తిరుగుతున్నాం కాబట్టి ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అనంతరం ఆమెను పెళ్లిపేరిట ప్రలోభపెట్టి ఆమెను అనుభవించేవాడు.
 
 కొంతకాలానికి బాలికకు తాను ఐదవ నెల గర్భవతినని తెలిసి జరిగిన విషయం ఇంట్లో చెప్పింది. విషయం రెండు గ్రామాల పెద్దల సమక్షంలోకి వెళ్లింది. ఇరు వర్గాల కుటుంబ సభ్యులతో సంప్రదించి బాలికకు న్యాయం చేస్తామని పెద్దలు హామీ ఇచ్చారు. అయితే, ఆ బాలికకు న్యాయం జరగలేదు. ఆమెకు ఎనిమిది నెలలు నిండాయి. పరిస్థితి చేయి దాటిపోయింది. దీంతో బాలిక తల్లిదండ్రులు ఈనెల 3న తాడేపల్లిగూడెం రూరల్ పోలీసులను ఆశ్రయించారు. అక్కడ కూడా పెద్దలు జోక్యం చేసుకుని తాము మాట్లాడుకుంటామని రాజీ ప్రయత్నాలు సాగించారు. అయితే యువకుడు మాత్రం ఆమెను వివాహం చేసుకునేందుకు నిరాకరిస్తున్నాడు. ఈ విషయం బయటకు పొక్కడంతో పోలీసులు కేసు నమోదు చేసి యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు.
 

మరిన్ని వార్తలు