వేధింపులు భరించలేకపోతున్నాం!

26 Nov, 2018 16:32 IST|Sakshi
విద్యార్థినుల సమస్యలు తెలుసుకుంటున్న జిల్లా బాలల సంక్షేమ సమితి చైర్మన్, చైల్డ్‌లైన్‌ అధికారులు

బాలల సంక్షేమ సమితి ఎదుట వాపోయిన మిరియం రక్షిత గృహ బాలికలు

నిర్వాహకుల వేధింపులను ఏకరువు పెట్టిన వైనం

శ్రీకాకుళం  , సోంపేట: మండలంలోని పలాసపురంలో ‘మిరియం బాలికల రక్షిత గృహం’ నిర్వాహకులు పిల్లలను వేధింపులకు గురిచేస్తున్నట్లు గుర్తిం చామని జిల్లా బాలల సంక్షేమ సమితి చైర్మన్‌ గరుగుబిల్లి నర్సింహమూర్తి తెలిపారు. శనివారం తమకు వచ్చిన వీడియో మెసేజ్‌ ఆధారంగా ఆదివారం రక్షిత గృహాన్ని ఆకస్మికంగా సందర్శించగా పలు విషయాలు వెలుగు చూశాయని స్థానిక విలేకరులకు వెల్లడించారు. నిర్వాహకుల దుస్తులు ఉతికించడం, వారు వినియోగించే మరుగుదొడ్లు కడిగించడం, నిర్వాహకుల పిల్లలకు స్నానాలు చేయించడం, మలమూత్ర విసర్జన చేసినప్పుడు కడగటం వంటి పనుల్ని చెబుతున్నారని బాలికలు వాపోయారని పేర్కొన్నారు.

ఈ విషయాలను బయటకు చెబితే భోజనం పెట్టకుండా బెదిరించేవారని,  బానిసలుగా చూస్తూ శారీరకంగా, మానసికంగా వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు.  ఈ నేపథ్యంలో నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకునేందుకు ముందుగా స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తామన్నారు. పూర్తి నివేదికను నాలుగు రోజుల్లో జిల్లా బాలల సంక్షేమ సమితికి అందజేయాల్సిందిగా ఇచ్ఛాపురం చైల్డ్‌లైన్‌ బృందాన్ని ఆదేశించారు. తదుపరి చర్యలు తీసుకునేవరకు పిల్లలను ఏవిధమైన హింసకు గురిచేయవద్దని నిర్వాహకులను హెచ్చరించారు. జువైనల్‌ జస్టిస్‌ చట్టప్రకారం బాలల హక్కులను ఉల్లంఘించిన యాజ మాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకొని రక్షిత గృహం గుర్తింపును రద్దుచేసేందుకు చర్యలు తీసుకొంటామని చెప్పారు. కార్యక్రమంలో బాలల సం క్షేమ సమితి సభ్యులు బగాది శశిభూషణ్‌చౌదరి, రౌతు జ్యోతికుమారి, బద్దాల సురేష్,బాలల రక్షణ అ«ధికారి మెట్ట మల్లేశ్వరరావు, ఇచ్ఛాపురం చైల్డ్‌లై న్‌ పీసీ సుధీర్, ఆర్‌.ఝాన్సీ, పలాస చైల్డ్‌లైన్‌ ప్రాజె క్టు కో–ఆర్డినేటర్‌ క్రాంతికుమార్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు