విజయవాడ వించిపేటలో ఉద్రిక్తత

1 Jul, 2018 11:20 IST|Sakshi

సాక్షి, విజయవాడ : నగరంలోని వన్ టౌన్ వించిపేటలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మైనారిటీలకు చెందిన పవిత్రమైన పీర్ల సావడి స్థలాన్ని కబ్జా చేసేందుకు స్థానిక ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్‌ ఖాన్‌ ప్రయత్నించిన బాగోతం బయటపడింది. పీర్ల సావడి స్థలం నుంచి పీర్లకు సంబంధించిన సామగ్రిని ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అనుచరులు బయటపడేసి దౌర్జన్యానికి దిగారు. అంతేకాకుండా ఈ స్థలంలో మాంసం దుకాణాన్ని ఏర్పాటుచేశారు. స్థానిక ఎమ్మెల్యే అనుచరుల దౌర్జన్యాన్ని, కబ్జాయత్నాన్ని వ్యతిరేకిస్తూ పీర్ల సావడి వద్ద ముస్లింలు ఆందోళనకు దిగారు. దీంతో ఇక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది.

తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో విజయవాడలో కబ్జాలు పెరిగిపోయాయని, తాజాగా పవిత్రమైన ముస్లింల ప్రదేశాన్ని కూడా టీడీపీ నేతల అండగా కబ్జా చేస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ముస్లిం నేతలు, ముస్లిం ప్రజలు పీర్ల సావడి కబ్జాయత్నంపై భగ్గుమంటున్నారు. ఎమ్మెల్యే జలీల్‌ ఖాన్‌ నగరంలోని ఖాళీ ప్రదేశాలపై కన్నేసి.. కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని మండిపడుతున్నారు.

మరిన్ని వార్తలు