రాజాపై దాడి దారుణం..

1 Nov, 2017 10:00 IST|Sakshi
జక్కంపూడి రాజాను పరామర్శిస్తున్న కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి

పోలీసులకు కొట్టే అధికారం ఎక్కడిది?

ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి  

కొత్తపేట, దానవాయిపేట (రాజమహేంద్రవరం): ‘వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజాపై రామచంద్రపురం ఎస్సై నాగరాజు దౌర్జన్యం, దాడికి పాల్పడడంవ దారుణమని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. మంగళవారం రాజమహేంద్రవరం లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందు తున్న రాజాను  ఆయన పరామర్శించారు.  జగ్గిరెడ్డి మాట్లాడుతూ ఈ ప్రభుత్వంలో కొందరు పోలీసు అధికారులు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. చంటి బిడ్డతో కారులో ఉన్న రాజాను దౌర్జన్యంగా బయటకు లాగి, స్టేషన్‌కు తీసుకువెళ్లి లాఠీచార్జి చేయడం దారుణమైన సంఘటనగా అభివర్ణించారు. దీనిపై ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు. జగ్గిరెడ్డి వెంట ఆలమూరు మండల వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు తమ్మన శ్రీను, జిల్లా కార్యదర్శి తోరాటి లక్ష్మణరావు, పార్టీ నాయకులు దొడ్డా రాంబాబు, మడికి రాజు తదితరులు ఉన్నారు.

హోంమంత్రి నోరు మెదపలేదేం?
జక్కంపూడి రాజాపై ఎస్సై దౌర్జన్యాన్ని, లాఠీచార్జీని రామచంద్రపురం ఎమ్మెల్యే  తోట త్రిమూర్తులు ఖండించినా, జిల్లాకు చెందిన హోంమంత్రి ఒక్కమాట కూడా మాట్లాడకపోవడంపై జగ్గిరెడ్డి విచారం వ్యక్తం చేశారు.  మంగళవారం సాయంత్రం బిళ్లకుర్రు శివారు మాసాయిపేటలో మాజీ సర్పంచ్, వైఎస్సార్‌సీపీ జిల్లా బీసీ విభాగం సభ్యుడు దూనబోయిన సత్యనారాయణ స్వగృహంలో జగ్గిరెడ్డి విలేకర్లతో మాట్లాడారు. ప్రజలను రక్షించాల్సిన పోలీసులకు కొట్టే అధికారం ఎక్కడిదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు వ్యవస్థపై ఉన్న గౌరవంతోనే తాము ఇంత వరకు ఆగుతున్నామని, తమ సత్తా ఏమిటో చూపేందుకు పార్టీపరంగా సమాయత్తమవుతున్నట్టు హెచ్చరించారు.  సమావేశంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గొల్లపల్లి డేవిడ్‌రాజు, జిల్లా సేవాదళ్‌ అధ్యక్షుడు మార్గన గంగాధరరావు, మండల పార్టీ అధ్యక్షుడు ముత్యాల వీరభద్రరావు, జిల్లా కార్యదర్శులు నెల్లి లక్ష్మీపతిరావు, రెడ్డి చంటి, ఎంపీటీసీ సభ్యురాలు నూకపేయి మేరీ సుశీలారాణి, గ్రామ పార్టీ అధ్యక్షుడు కాకర సర్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు