రాజధాని పేరుతో సీఎం చక్కర్లు

22 Sep, 2015 03:57 IST|Sakshi

 ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
 
 మాచర్లటౌన్ : ఓటుకు నోటు విషయంలో ఇరుక్కుపోయిన సీఎం చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పలేక రాజధాని నిర్మాణం పేరుతో కోట్ల రూపాయలను ఖర్చు పెడుతూ విదేశాలలో చక్కర్లు కొడుతున్నారని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విమర్శించారు. సోమవారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా సాధనకు కేంద్రంపై పోరాటం చేయాల్సిన చంద్రబాబు మిత్రపక్షంగా వ్యవహరిస్తూనే ఒత్తిడి చేస్తే ఎక్కడ కేంద్రం ఓటుకునోటు విషయంలో అరెస్ట్ చేస్తుందోనని భయపడుతున్నారన్నారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మాణం చేశామని  చెబుతున్న ప్రభుత్వం కూలిపోయిన తమ్మిలేరు అక్విడెక్ట్‌కు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. కమీషన్‌ల కోసం హడావుడిగా నిర్మాణ పనులు చేయడంతోనే ఈ పరిస్థితి నెలకొందన్నారు.

ఇటువంటి అవినీతి చర్యలను ప్రోత్సహిస్తున్న చంద్రబాబు ప్రజాసమస్యలు, ప్రత్యేకహోదాలను పట్టించుకోకపోవటంపై వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 26న నిరవధిక దీక్షను గుంటూరులో చేపడుతున్నారని చెప్పారు. పల్నాడు ప్రాంతం నుంచి ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో దీక్షలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.   మండల కేంద్రాలలో 27, 28 తేదీలలో  దీక్షకు మద్దతుగా జరిగే రిలేనిరాహార దీక్షలను పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు.

మరిన్ని వార్తలు