షాహిదా బేగం ఇక నా దత్త పుత్రిక : ఎమ్మెల్యే రాచమల్లు

22 Oct, 2019 06:40 IST|Sakshi
షాహిదా బేగంతో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి

సాక్షి, ప్రొద్దుటూరు : ఓ పేద విద్యార్థినిని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి అక్కున చేర్చుకున్నారు. ఆమెను అన్ని విధాలా ఆదుకుంటానని భరోసా ఇచ్చారు. సోమవారం ప్రొద్దుటూరులో టీటీడీ పాలకమండలి సభ్యుడు చిప్పగిరి ప్రసాద్‌ సన్మాన కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముందు 6 తరగతి విద్యార్థిని షాహిదా బేగం జానపద గేయం పాడి అందరినీ అలరించింది. ఎమ్మెల్యే స్పందించి విద్యార్థినిని వేదికపైకి పిలిచారు. రూ.5వేలు నగదు బహుమతి అందించారు. మండలంలోని మీనాపురం గ్రామానికి చెందిన షాహిదాబేగంకు తండ్రి లేడని ఆయన తెలుసుకున్నారు. పేదరికంలో పుట్టిన ఆమె చదువుకు తాను పూర్తిగా సహకరిస్తానని వెంటనే ప్రకటించారు. ఎంత వరకు చదివినా ఆర్థిక సహాయం అందిస్తానన్నారు. పెళ్లి బాధ్యత కూడా తీసుకుంటానని చెప్పడంతో హర్షధ్వానాలు మారుమోగాయి. ఎమ్మెల్యే నిర్ణయం పట్ల ఉపాధ్యాయులు, విద్యార్థులు సర్వత్రా హర్షం వ్యక్తం చేశారు.  

మరిన్ని వార్తలు