బండారూ.. ఇదేం పని!

7 Jan, 2019 10:09 IST|Sakshi

మత్స్యకారులను మోసం చేసిన పెందుర్తి ఎమ్మెల్యే

పెద్దల ఒప్పందానికితూట్లు పొడిచిన వైనం

టీడీపీ సానుభూతిపరులకు ఫార్మాసిటీ ఉద్యోగాలు

అంతా నా ఇష్టం.. ఎవరేమనుకుంటే నాకేంటి అన్నట్టుగా ఉంది పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి తీరు. అధికారం చేతిలో ఉంది కదా అనిఏదైనా చేయొచ్చు అనేలా ఆయన వ్యవహరిస్తున్నారు.
పెద్దల సమక్షంలో జరిగిన ఒప్పందాలకు ఎమ్మెల్యేనిస్సిగ్గుగా తూట్లు పొడిచేసి నిబంధనలకు తిలోదకాలిచ్చేశారు. అందిన కాడికి దండుకుని ఫార్మా ఉద్యోగాలనుపప్పు బెల్లాల మాదిరిగా పచ్చ చొక్కాల వారికి పంచిపెట్టేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అర్హులైన పేదోళ్లపొట్ట కొట్టారు.

సాక్షి, విశాఖపట్నం: ఇది పదేళ్ల కిందట మాట.. పరవాడ ఫార్మాసిటీ నుంచి వచ్చే కాలుష్యం వల్ల మత్స్యసంపద దెబ్బతింది. ముత్యాలమ్మపాలెం, దిబ్బపాలెం, జాలరి పేట గ్రామాల మత్స్యకారులకు ఉపాధి లేకుండా పోయింది. దీంతో వారంతా ఫార్మాసిటీ వద్ద ఆందోళనకు దిగి పైపులైన్లు కోసేశారు. అప్పటి పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు, ఫార్మాసిటీ యూని యన్‌ పెద్దల సమక్షంలో ఒప్పందం జరి గింది. ఆయా మత్స్యకార గ్రామాలకు చెందిన 600 మంది యువతకు పార్టీలకతీతంగా ఉద్యోగాలు కల్పిస్తామని ఫార్మాసిటీ పెద్దలు అంగీకరించారు. ఆ మేరకు అప్పటి ఆర్డీవో, తహసీల్దార్, రెవెన్యూ అధికారుల సమక్షంలో ఇరువర్గాలు ఒప్పంద పత్రాలపై సంతకాలు కూడా చేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి కూడా ఆ సమయంలో మాజీ ఎమ్మెల్యేగా ఆ ఒప్పంద పత్రంలో సంతకం చేశారు.
ఆ తర్వాత పరిణామాలతో ఈ ఉద్యోగాల కోసం అనేక దఫాలుగా పోరాటాలు జరిగాయి. ఆందోళనలు జరిగినప్పుడల్లా నాటి ఒప్పందం మేరకు ఉద్యోగాలిస్తామని ఫార్మాసిటీ పెద్దలు చెప్పుకుంటూవచ్చారు. అధికారులు కూడా అదే రీతిలో మత్స్యకార యువతను ఊరడిస్తూ వచ్చారు. తీరా ఉద్యోగాల కల్పన దగ్గరకు వచ్చేసరికి అధి కారులు ‘పచ్చ’పాతం చూపించారు. పార్టీల కతీతంగా ఆయా గ్రామాల్లో ఆందోళన జరిగిన సమయానికి ఉన్న నిరుద్యోగ యు వతకు ఉపాధి కల్పించాల్సి ఉంది. కానీ బండారు మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయింది.

అప్పట్లో ఆయా గ్రామాల్లో కాంగ్రెస్, టీడీపీ ఉండేవి. ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ, టీడీపీ సానుభూతి పరులున్నారు. అంతే కాదు..ఆయా గ్రామాలన్నీ నిన్న మొన్నటి వరకు వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఏలుబడిలో ఉన్నవే. ఈ కారణంగా ఉద్యోగాలు ఎప్పుడు కల్పించినా.. ఇరువర్గాలకు చెందిన నిరుద్యోగులకు గ్రామసభ తీర్మా నం మేరకు అవకాశాలు కల్పిస్తామని యూనియన్‌ పెద్దలు చెప్పుకుంటూ వచ్చారు. ఈ మేరకు తొలి విడతగా 100 ఉద్యోగాల కల్పనకు ఫార్మాసిటీ కంపెనీలు ఒకే చెప్పాయి. అంతే అప్పటివరకు పార్టీలకతీతంగా ఉద్యోగాల కల్పిస్తామన్న ఎమ్మెల్యే బండారు ఒక్కసారిగా స్వరం మార్చారు. తానిచ్చిన వారికే ఉద్యోగాలు కల్పించాలంటూ జేఎన్‌పీసీ మాన్యుఫ్యాక్టరింగ్‌ అసోసియేషన్, జవహర్‌లాల్‌ నెహ్రూ రాంకీ ఫార్మాసిటీ కంపెనీల యాజ మాన్యాలౖపై ఒత్తిడి తీసుకురావడం ప్రారంభించారు. కొన్ని కంపెనీల ప్రతినిధులు గ్రామసభల తీర్మానం మేరకు జాబితాలు వస్తే ఇస్తామని తేల్చి చెప్పినా.. తాను చెప్పిందే ఫైనల్‌ అన్నట్టుగా ఎమ్మెల్యే హుకుం జారీ చేశారు.

ఎమ్మెల్యే సిఫార్సు చేసిన వారికి మాత్రమే ఉద్యోగాలు కల్పించడం సరికా దని.. పార్టీలకతీతంగా అందరికీ ఉద్యోగాలు కల్పించాలంటూ వైఎస్సార్‌ సీపీ, ఇతర పార్టీల నేతలు డిమాండ్‌ చేశారు. కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్, జేసీ సృజన, ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, తేజ్‌భరత్‌లకు జాబితాలందజేశారు. తప్పకుండా గ్రామసభలు పెట్టి అన్ని వర్గాల వారికి ఒకేలా న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన అధికారులు ఆచరణ లోకి వచ్చేసరికి ఎమ్మెల్యే బండారు ఒత్తిళ్లకు తలొగ్గారు. జీ హుజూర్‌ అంటూ ఆయన ఇచ్చిన జాబితానే పార్మాసిటీ యూనియన్‌ పెద్దలకు పంపించారు. ఎమ్మెల్యే సిఫార్సు చేసిన జాబితాను తప్ప మరే ఇతర జాబితాలను పట్టించుకోవద్దని, గతంలో తాము పంపిన జాబితాలను కూడా పక్కన పెట్టేయాలని ఆర్డీవో తేజ్‌ భరత్‌ స్వయంగా లిఖిత పూర్వకంగా ఆదేశాలు జారీ చేశారు. సంక్రాంతి లోనే ఎమ్మెల్యే బండారు సమర్పించిన జాబి తా మేరకు పచ్చచొక్కా కార్యకర్తలకు ఉద్యోగాలు కల్పిస్తూ పార్మాసిటీ నియామక ఉత్తర్వులు జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పైగా ఈ ఉద్యోగాల కల్పన విషయంలో జన్మభూమి కమిటీ సిఫార్సులు అవసరం లేదు. పూర్తిగా గ్రామసభ తీర్మానం మేరకే కల్పించాల్సి ఉంది. కానీ ఇక్కడ కూడా జన్మభూమి కమిటీ  చక్రం తిప్పింది. ఎమ్మెల్యే బండారు, ఆయన తనయుడు అప్పలనాయుడు తరఫున కమిటీ సభ్యులు తమకు అనుకూలంగా ఉన్న వారి పేర్లతో జాబితాను సిద్ధం అధికారులకు పంపారు.

ఒప్పందం మేరకు ఆందోళన జరిగిన సమయంలో నిరుద్యోగులుగా ఉన్న యువతకు ప్రాధాన్యమివ్వాలి. కానీ బండారు ఇచ్చిన జాబితాలో ఆయా గ్రామాలకు చెందిన టీడీపీ సానుభూతి పరులతో పాటు ఇతర గ్రామాలకు చెందిన వారిని కూడా స్థానికులుగా చూపించినట్టు తెలుస్తోంది. పైగా ఒకటి రెండు కుటుంబాలకు చెందిన వారికే ఎక్కువ మందికి ఉద్యోగాల కల్పనకు సిఫార్సు చేయడం విమర్శలకు తావిస్తోంది. మరో పక్క ఉద్యోగాలకల్పన పేరిట భారీగా వసూళ్లకు పాల్పడినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. రూ.2 లక్షల నుంచి రూ.5లక్షల వరకు వసూళ్లు సాగించినట్టుగా అధికార పార్టీలోనే చర్చ జరుగుతోంది.

చాలా అన్యాయం
నాటి ఒప్పందం మేరకు గ్రామసభ తీర్మానం చేసి పార్టీలకతీతంగా దెబ్బతిన్న గ్రామాల నిరుద్యోగులకు ఫార్మాసిటీలో ఉద్యోగాలు కల్పించాలి. కానీ అలా కాకుండా ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అధికారులు, ఫార్మాసిటీ యూనియన్‌ పెద్దలపై ఒత్తిళ్లు తీసుకొచ్చి గ్రామసభ పెట్టకుండానే ఓ జాబితాను పంపించారు. ఆయన చర్యల వల్ల అర్హులైన నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు దక్కకుండా పోయాయి. ఈ విషయంలో అర్హులకు న్యాయం జరిగేలా న్యాయపోరాటం చేసేందుకు కూడా వెనుకాడబోం.– బొంది అచ్చిబాబు,మండల ఉపాధ్యక్షుడు, వైఎస్సార్‌ సీపీ

మరిన్ని వార్తలు