సాక్షి, చిత్తూరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు మూడు లక్షల కోట్ల అప్పుల్లో ముంచేసినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా చెప్పారు. లాక్డౌన్ కారణంగా రాష్ట్రానికి ఆదాయం లేకపోయినా కూడా డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీలకు రుణాలు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుందన్నారు. చిత్తూరు జిల్లా నగరిలో ఏర్పాటు చేసిన సున్నావడ్డీ రుణాల పంపిణీ కార్యక్రమంలో రోజా పాల్గొన్నారు. ఈ పథకం ద్వారా నియోజక వర్గంలోని 4 వేల935 గ్రూపులకు..11 కోట్ల 33 లక్షల రుణాలు అందించారు.
‘డ్వాక్రా మహిళల గురించి మాట్లాడే అర్హత టీడీపీ నేతలకు లేదు. గతంలో చంద్రబాబు సున్నా వడ్డీ ఇవ్వకుండా 3వేల కోట్లు ఎగ్గొట్టారు. డ్వాక్రా మహిళలను చంద్రబాబు నిలువునా ముంచేశారు. టీడీపీ నేతలు బురదచల్లడమే పనిగా పెట్టుకున్నారు. ఎమ్మార్వో వనజాక్షిపై దాడి చేసినప్పుడు.. టీడీపీ మహిళా నేతలు ఎందుకు మాట్లాడలేదు? టీడీపీ హయాంలో కాల్మనీ సెక్స్ రాకెట్ గురించి ఎందుకు ప్రశ్నించలేదు. డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తామని మోసం చేసినప్పుడు ఏమైపోయారు? ’ అని రోజా మండిపడ్డారు.