జగనన్న పాలన సజావుగా సాగాలంటూ.. ఎమ్మెల్యే పాదయాత్ర

24 Jun, 2019 08:15 IST|Sakshi

సాక్షి, ఎర్రగుంట్ల(కడప) : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలన సుఖ సంతోషాలతో 20ఏళ్ల పాటు సాగాలని, నియోజకవర్గంలోని అన్ని మండలాలు సస్యశామలంగా ఉండాలని ఎమ్మెల్యే డాక్టర్‌ మూలె సుధీర్‌రెడ్డి ఆకాంక్షించారు. ఈమేరకు ఆయన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం నిడుజివ్వి గ్రామం నుంచి తిరుమలకు ఆదివారం పాదయాత్ర చేపట్టారు. తొలుత ఆయన తల్లి మూలె లక్ష్మిదేవికి పాదాభివందనం చేశారు. పాదయాత్రలో రాష్ట్ర కార్యదర్శి మూలె హర్షవర్దన్‌రెడ్డి, వందలాది మంది నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ‘సాక్షి’తో మాట్లాడారు. వైఎస్సార్‌ సీపీకి ప్రజలు అఖండ మెజారిటీ ఇచ్చారన్నారు. దివంగత సీఎం వైఎస్సార్‌ పాలనలా జగన్‌ పాలన ఉంటుందన్నారు. జిల్లా ప్రజలందరూ సుఖంగా ఉండాలని కోరుకున్నారు. ఆర్థిక లోటు లేకుండా కష్టాలు రాకుండా రైతులకు మేలు జరగాలని, చెరువుల్లో నీరు నిండాలని ఆకాంక్షించారు. గండికోట నీటిని ఆరు మండలాల ప్రజలు సక్రమంగా వినియోగించుకోవాలని కోరారు. పార్టీలకతీతంగా ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తామన్నారు. బ్రాహ్మణీ స్టీల్‌ ప్లాంట్‌ వస్తే నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు.  

210 కిలోమీటర్ల పాదయాత్ర 
నిడుజివ్వి నుంచి కదిరివారిపల్లె, వలసపల్లె, తుమ్మలపల్లి, పెద్దనపాడు, ఉరుటూరు వీయన్‌ పల్లె , వేంపల్లి, గండి , రాయచోటి, పీలేరు మీదుగా పాదయాత్ర 210 కిలోమీటర్లు సాగనుంది. స్థానిక నాయకులు ఎమ్మెల్యేకు బ్రహ్మరథం పట్టారు. పాదయాత్ర సాగిన మార్గంలో ఉన్న ఆలయాల్లో ఎమ్మెల్యే పూజలు చేశారు.  సీఐ కొండారెడ్డి ప్రత్యేక పోలీసు బలగాలతో బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముద్దనూరు మాజీ ఎంపీపీ మునిరాజరెడ్డి, మాజీ ఎంపీటీసీ సురేంద్రనాథ్‌రెడ్డి, వ్యవసాయ మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ వై విశ్వభార్గవరెడ్డి, నాయకులు వెంకటశివారెడ్డి, కౌన్సిలర్లు డి.సూర్యనారాయణరెడ్డి, పద్మనాభయ్య, మల్లు గోపాల్‌రెడ్డి, డి గంగాక్రిష్ణారెడ్డి, జయరామక్రిష్ణారెడ్డి, హనుమంతురెడ్డి, ముద్దనూరు కన్వీనర్‌ శ్రీధర్‌రెడ్డి, ఎర్రంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఎంపీటీసీ వరధారెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యులు రషీద్, కోకోకోల గౌస్‌ చిన్నషేట్, మైనార్టీ నాయకులు ఇస్మాయిల్, అబ్దుల్‌ గఫూర్, వలి తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు