రాప్తాడును కోనసీమగా మారుస్తాం

7 Jun, 2020 08:09 IST|Sakshi
అభిమానుల మధ్య పుట్టిన రోజు కేక్‌ కట్‌ చేస్తున్న ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి

హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలను పారించి రాప్తాడు నియోజకవర్గాన్ని కోనసీమగా మారుస్తామని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి అన్నారు. శనివారం ఆయన పేరూరు డ్యాంను సందర్శించి గంగ పూజ నిర్వహించారు. ఇదే సమయంలో ఆయన పుట్టిన రోజును పురస్కరించుకొని అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి శుభాకాంక్షలు తెలిపారు. లక్ష ఎకరాలకు సాగునీటిని అందించడమే తన లక్ష్యమని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.

సాక్షి, అనంతపురం: హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలను పారించి రాప్తాడు నియోజకవర్గాన్ని కోనసీమగా మారుస్తామని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి అన్నారు. తొలిసారిగా హంద్రీనీవా కాలువ నుంచి పేరూరు డ్యాంకు కృష్ణా జలాలు వచ్చిన సందర్భంగా శనివారం రామగిరి మండలంలోని పేరూరు అప్పర్‌ పెన్నార్‌ ప్రాజెక్టును ఎమ్మెల్యే సందర్శించారు. గంగపూజ అనంతరం విలేకర్లతో మాట్లాడారు. మహానేత వైఎస్‌ రాజశేఖర రెడ్డి అకాల మరణం తర్వాత వచ్చిన పాలకులు అలసత్వం ప్రదర్శించారన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మహానేత ఇచ్చిన హామీ మేరకు హంద్రీనీవా కాలువ ద్వారా మడకశిర బ్రాంచి కెనాల్‌ నుంచి పేరూరు డ్యాంకు నీరందించేందుకు జీఓ తీసుకొచ్చారన్నారు. కేవలం రూ.కోటిన్నర ఖర్చుతో పేరూరు డ్యాంకు నీరు తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు.

గత ప్రభుత్వ హయాంలో డబ్బులను దోచుకునేందుకు మాజీ మంత్రి పరిటాల సునీత రూ.804 కోట్లతో జీఓ తీసుకొచ్చిందని ఆరోపించారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆశీస్సులతో నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీరందించడమే ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కృష్ణా జలాల ద్వారా 10 వేల ఎకరాల ఆయకట్టుకు ప్రత్యక్షంగా, 40 వేల ఎకరాలకు పరోక్షంగా సాగు నీరందుతున్నారు. నియోకవర్గ పరిధిలో హంద్రీనీవా కింద మరో నాలుగు రిజర్వాయర్లు నిర్మిస్తామని, వీటి ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరందించి సస్యశ్యామలం చేసి తీరుతామన్నారు. కార్యక్రమంలో సీనియర్‌ నాయకుడు తోపుదుర్తి రాజశేఖర్‌రెడ్డి, మార్కెట్‌యార్డు చైర్మన్‌ నాగేశ్వర రెడ్డి, నాయకులు క్రిష్ణారెడ్డి, వెంకటరాముడు, పసుపుల ఆది, వెంకటేష్, అమరనాథరెడ్డి, గోపాల్‌రెడ్డి, నరసింహారెడ్డి, మీనుగ నాగరాజు, నాగముని, గోవిందురెడ్డి, బాలపోతన్న, తదితరులు పాల్గొన్నారు. చదవండి: భరత్‌ అనే నేను..    

మరిన్ని వార్తలు