అసెంబ్లీ మీడియా పాయింటు వద్ద తెలంగాణ బిల్లు ప్రతిని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దేవినేని ఉమా మహేశ్వరరావు తదితరులు చించేశారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని తామంతా కోరుతుంటే, తమ మనోభావాలకు విరుద్ధంగా తెలంగాణ బిల్లును ఆగమేఘాల మీద తీసుకొచ్చి సభలో ప్రవేశపెట్టడానికి నిరసనగా తానీ చర్యకు పాల్పడినట్లు ఆయన చెప్పారు.
దీనిపై తెలంగాణ ప్రాంత నాయకులు గంగుల కమలాకర్ తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్రమైన పత్రాన్ని, ఇంతకాలంగా కోట్లాది మంది ప్రజలు ఎదురుచూస్తున్న బిల్లును చించేయడం దారుణమని చెన్నమనేని రమేష్ అన్నారు. ఒకవైపు తెలంగాణ కావాలని, మరోవైపు సమైక్యాంధ్ర అనడం దారుణమన్నారు. కేసీఆర్ నాయకత్వంలో అమరుల సాక్షిగా బిల్లును స్పీకర్ ప్రవేశపెట్టారని, ఈ బిల్లును వచ్చే నాలుగైదు రోజుల్లోనే చర్చించి, త్వరగా ఆమోదించాలని, అందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన అన్నారు.