ఎలా నిర్వహించాలి?

4 Jun, 2015 00:59 IST|Sakshi
ఎలా నిర్వహించాలి?

- ఎమ్మెల్సీల ఎన్నికపై అస్పష్టత..!
- సింగిల్ బ్యాలెట్టా..? డబుల్ బ్యాలెట్టా..?
- ఆ స్థానం పదవీకాలం నాలుగేళ్లా..?..ఆరేళ్లా..?
- 2007లో ఒకే బ్యాలెట్‌లో నిర్వహణ
- అలాగే నిర్వహించాలంటున్న నిపుణులు
- ఎన్నికల సంఘానికి లేఖ రాసిన అధికారులు
సాక్షి, విశాఖపట్నం:
జిల్లాలో స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీల నోటిఫికేషన్‌లో గందరగోళం నెలకొంది.  రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఒకే బ్యాలెట్‌లో నిర్వహించాలా? లేక రెండు  బ్యాలెట్‌లో నిర్వహించాలా? అనే సందిగ్దత నెలకొంది. ఒకస్థానం 2013లోనే ఖాళీకాగా, మరో స్థానం గతనెల 1వ తేదీతో ముగిసింది. దీంతో ఖాళీ అయిన రెండేళ్లకు ఎన్నిక నిర్వహిస్తున్నందున ఆస్థానానికి తదుపరి పదవీ కాలం నాలుగేళ్లుంటుందా? లేక మిగిలిన స్థానాల మాదిరిగా ఆరేళ్లుంటుందా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల నిర్వహణ..పదవీకాలాల విషయంలో అధికారుల్లో గందరగోళం నెలకొంది. ఈ అంశాలపై ఇప్పటికే జిల్లా యంత్రాంగం అభ్యర్థన మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ను రాష్ర్ట ఎన్నికల సంఘం వివరణ కోరేందుకు లేఖ రాసింది.

ఒకే బ్యాలట్ నిర్వహించాలి
ఒకే బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించిన విధంగానే నిర్వహించాలంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు జిల్లాను నియోజకవర్గంగా పరిగణిస్తారని చెప్పారు. దీనిపై ఎన్నికల సంఘం స్పష్టత ఇవ్వలేదు. గుంటూరు జిల్లాలో రెండు స్థానాలకు ఒకే బ్యాలెట్ ద్వారా నిర్వహిస్తామనడం వివాదాస్పదవుతోంది.  2007లో శాసనమండలి పునరుద్ధరించిప్పుడు స్థానిక సంస్థల సభ్యుల సంఖ్యను బట్టి జిల్లాలకు ఎమ్మెల్సీస్థానాలను కేటాయించారు. ఈ విధంగా విశాఖకు రెండు కేటాయించారు. ఎన్ని స్థానాలున్నా..మండలిపరంగా జిల్లాను ఒక స్థానిక సంస్థల నియోజక వర్గంగా పరిగణిస్తారు. అందుకే  2007లో ఒకే బ్యాలెట్‌తోనే రెండు స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు.

ఆ ఎన్నికల్లో  కాంగ్రెస్ తరపున కిడారి సర్వేశ్వరరావు, టీడీపీ తరపున దాడి వీరభద్రరావులు ఎన్నికయ్యారు. లాటరీలో కిడారికి రెండేళ్ల పదవీకాలం, దాడికి ఆరేళ్ల పదవీకాలం దక్కింది. కిడారి స్థానం ఖాళీ  2009లో పూర్తికావడంతో కాంగ్రెస్ తరపున దాట్ల సూర్య నారాయణరాజు ఎన్నికయ్యారు. దాడి పదవీ కాలం 2013తో ముగిసింది. అదే సమయంలో స్థానిక సంస్థల పదవీకాలం ముగియడంతో వాటి ఎన్నికలతో ఈ ఎమ్మెల్సీ స్థానం ముడిపడి ఉన్నందున వాయిదాపడక తప్పలేదు.

2014 సార్వత్రిక ఎన్నికల ముందే స్థానిక ఎన్నికలు జరిగాయి. దాంతో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అందుబాటులోకి రావడంతో దాడి స్థానానికి ఎన్నికలు నిర్వహించే అవకాశం ఏర్పడింది. ఏడాదిగా నిర్వహించలేదు. డీఎస్‌ఎన్ రాజు పదవీ కాలం కూడా మే 1తో ముగియడంతో రెండు స్థానాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే పరిస్థితి ఏర్పడింది. పదవీకాలం ఎప్పుడు ముగిసినా ఒకే నియోక వర్గానికి చెందిన రెండు స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతున్నందున 2007లో మాదిరిగానే ఒకే బ్యాలెట్‌లో ఎన్నికలు నిర్వహించాలని నిపుణులు చెబుతున్నారు.

ప్రాధాన్యతా క్రమంలో ఓట్లు వేయాల్సి ఉన్నందున ఒకే ఓటరు రెండు మొదటి ప్రాధాన్యతా ఓట్లు వేసే అవకాశం ఉండదంటున్నారు. రెండు స్థానాలకు ఇద్దరు మాత్రమే బరిలో ఉంటే ఆటోమేటిక్‌గా ఏకగ్రీవమవుతారని..అదే ఇద్దరు కంటే ఎక్కువ మంది పోటీపడితే మాత్రం ఒకే బ్యాలెట్‌లో ఎన్నికలు జరిగితే ఓటర్లు ప్రాధాన్యతా క్రమంలో ఓట్లు వేస్తారని, అప్పుడు మొదటి ప్రాధాన్యతా ఓట్లు(51శాతం) ఏ ఇద్దరు తెచ్చు కుంటే వారే విజేతలువుతారని వివరిస్తున్నారు.

జిల్లా యంత్రాంగం రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. ఎలా నిర్వహించాలన్నదానిపై స్పష్టత కోరింది. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా కొంత గందరగోళానికి గురవుతోంది. దాంతో రాష్ట్రంలో పరిస్థితిని వివరిస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి(సీఈసీ)ని సంప్రదించాలని భావిస్తోంది. సీఈసీ ఆదేశాలమేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లా ఉన్నతాధికారులకు సరైన మార్గనిర్దేశం చేసే అవకాశాలున్నాయి. జిల్లా ఎన్నికల అధికారి కె.నాగేశ్వరరావును ‘సాక్షి’ సంప్రదించగా మార్గదర్శకాల కోసం ఎన్నికల సంఘాన్ని కోరామన్నారు.

మరిన్ని వార్తలు