మళ్లీ ఎమ్మెల్సీ పదవుల ఆశ

8 May, 2015 02:35 IST|Sakshi

అంబికా కృష్ణ, పాందువ్వ శీనులకు బెర్త్ దక్కేనా?
 ఏలూరు: జిల్లాలో టీడీపీ నాయకులను ఎమ్మెల్సీ పదవులు ఊరిస్తున్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు కొత్తగా కేటాయించిన నాలుగు ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి ఈ నెల 14న నోటిఫికేషన్ జారీ కానుంది. జూన్ 1న ఎన్నికల నిర్వహించనున్నారు. కాగా తక్కువ కాల వ్యవధిలోనే మళ్లీ పదవులు భర్తీ కానుండడంతో గతంలో భంగపడ్డ వారు యత్నాలు ప్రారంభించారు. కొద్దినెలల క్రితం ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ పదవుల భర్తీ కాగా జిల్లాకు చెందిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మంతెన సత్యనారాయణరాజు (పాందువ్వ శ్రీను), ఏలూరు మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణలు పదవులపై ఆశలు పెట్టుకున్నారు.
 
 అంబికాకృష్ణకు పదవిని ఇవ్వాలని సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అధిష్టానానికి అప్పట్లో సిఫార్సు చేశారు. మరోవైపు జిల్లాకు చెందిన ఎక్కువ మంది ఎమ్మెల్యేలు పాందువ్వ శ్రీనుకు ఎమ్మెల్సీ ఇవ్వాలని అధినేతను కలిసి కోరారు. అయితే ఇద్దరికీ చుక్కెదురైంది. అన్ని సీట్లను గెలిపించి టీడీపీ అధికారంలో వచ్చేందుకు శ్రమించిన తెలుగు తమ్ముళ్లకు కీలకమైన ఈ పదవుల విషయంలో అధినేత అన్యాయం చేశారన్న విమర్శలు అప్పట్లో వినిపించాయి. ఈసారైనా పదవిని దక్కించుకోవాలని నాయకులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు