కేంద్ర పథకాల ప్రచారంలో ప్రధాని ఫొటో పెట్టండి

17 Sep, 2017 04:30 IST|Sakshi
కేంద్ర పథకాల ప్రచారంలో ప్రధాని ఫొటో పెట్టండి
సీఎస్‌కు ఎమ్మెల్సీ సోము వీర్రాజు లేఖ
 
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ‘స్వచ్ఛతే సేవ’ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో పెట్టకపోవడాన్ని నిరసిస్తూ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి శనివారం లేఖ రాశారు. రాష్ట్ర వ్యాప్తంగా పక్షం రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో మోదీ ఫొటో పెట్టేలా చర్యలు తీసుకోవాలంటూ లేఖలో పేర్కొన్నారు.

ప్రధాని మోదీ మానస పుత్రిక అయిన స్వచ్ఛ భారత్‌ మిషన్‌పై ప్రజల్లో మరింత చైతన్యం తీసుకురావడానికి కేంద్రం దేశవ్యాప్తంగా ఈ నెల 15 నుంచి ‘స్వచ్ఛతే సేవ’ పేరుతో పారిశుద్ధ్య ప్రచార ఉద్యమాన్ని చేపట్టిందని.. కేంద్రం చేపట్టిన ఈ ప్రచార ఉద్యమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిపుచ్చుకొని రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. అయితే ఈ కార్యక్రమాల్లో కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు ఫొటోలతో కూడిన పోస్టర్లను మాత్రమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని, ప్రధాని మోదీ ఫొటో ఎక్కడా కనిపించడం లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లారు. 
మరిన్ని వార్తలు