సదా మీ సేవలో

9 Sep, 2018 11:29 IST|Sakshi

తణుకు: తపాలా కార్యాలయాలు.. ఒకప్పుడు సమాచార వ్యవస్థలో కీలకం. కొరియర్లు, మొబైల్‌ వ్యవస్థ అందుబాటులోకి రావడంతో తపాలాశాఖ వెనుకబడింది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో పరుగెత్తలేక చేతులెత్తేయడంతో తపాలాశాఖ పేరు మర్చిపోయే పరిస్థితికి వచ్చింది. తమ మనుగడ కాపాడుకునేందుకు తంటాలు పడుతోంది. ఈ పరిస్థితుల్లో బ్యాంకులతో పోటీ పడేందుకు సిద్ధమైంది. బ్యాంకులకు సవాలు విసిరేలా తపాలాశాఖ అడుగులు వేస్తోంది. ఇప్పటికే బ్యాంకుల తరహాలో ఏటీఎం కార్డులు, నగదు జమ, డిపాజిట్‌ వంటి సేవలను అందిస్తుండగా తాజాగా మరో అడుగు ముందుకు వేసి బ్యాంకుల మాదిరిగా తమ ఖాతాదారులను సైతం అన్నిరకాల చెల్లింపులు చేసుకునేలా కొత్త తరహా సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంకు (ఐపీపీబీ) ద్వారా జీరో ఎక్కౌంట్‌లను తెరవడమే కాకుండా అన్నిరకాల చెల్లింపులు, ఇతర సేవలకు నామమాత్రపు రుసుములతో అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ నెల 1న దేశవ్యాప్తంగా ప్రారంభించిన ఈ విధానంలో తొలుత జిల్లాలోని ఏలూరు, భీమవరం డివిజన్లలో ఈ సేవలను ప్రారంభించారు. 

సేవలు విస్తృతం
బ్యాంకు వ్యక్తిగత ఖాతాలో నగదు తీయాలన్నా, వేయాలన్నా ఆ వివరాలు రాసిన ఓచర్‌ బ్యాంకులో అందజేయడం తప్పనిసరి. దీంతో ఆ అవసరం లేని సేవలు తపాలాశాఖ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఐపీపీబీ పేరుతో సెప్టెంబరు 1 నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ సేవల ముఖ్య ఉద్దేశం వృద్ధులు, విద్యార్థులు, గృహిణులు, పట్టణాలకు వచ్చే వలసదారులు, రైతులు, వివిధ పథకాల లబ్ధిదారులు, చిన్న వ్యాపారులకు ప్రయోజనం చేకూర్చడమేనని తపాలాశాఖ అధికారులు చెబుతున్నారు. కేవలం ఆధార్‌కార్డు ఆధారంగా పొదుపు ఖాతాను జీరో బ్యాలెన్స్‌తో తెరుచుకునే వెసులుబాటు కల్పించారు. వ్యాపారులు, సంస్థలకు అవసరమైన కరెంట్‌ ఖాతాలను సైతం పొందవచ్చు. 

అన్నిరకాల చెల్లింపులు, నగదు బదిలీలు, అన్నిరకాల బిల్లులు, వినియోగ ఛార్జీలు, వ్యాపార లావాదేవీలు చేసుకునే వెసులుబాటు ఉంది. ఇదే సందర్భంలో ఖాతాలో రూ. లక్షకు మించి నిల్వ ఉండటానికి వీలుండదు. లావాదేవీల చెల్లింపులకు పొదుపు ఖాతాదారుల నుంచి ఎలాంటి రుసుం వసూలు చేయరు. బ్యాంకులకు రాలేని స్థితిలో ఉన్నప్పటికీ, తీరిక లేకున్నా ఖాతాదారుని ఇంటివద్దకు వచ్చి మరీ సేవలు అందించడం విశేషం. ఇలాంటి సందర్భాల్లో మాత్రం పరిమితంగానే ఛార్జీలు వసూలు చేస్తారు. తాపాలా బ్యాంకులకు రాలేని వారు మొబైల్‌ నుంచి మెసేజ్‌ పంపినా, మిస్డ్‌ కాల్‌ చేసినా రూ.10 వేలకు మించని లావాదేవీలు నేరుగా ఇంటికే వెళ్లి అందజేస్తారు. ఇందుకు సంబంధించి ప్రతి ఖాతాదారుడికి ఒక క్యూఆర్‌ (క్విక్‌ రెస్పాన్స్‌ కోడ్‌) ఉన్న డెబిట్‌ కార్డును అందజేస్తారు. దీని ద్వారా ప్రస్తుతం మార్కెట్‌లో వినియోగంలో ఉన్న పేటీఎం మాదిరిగా విద్యుత్‌ బిల్లులు, పెట్రోలు కొనుగోళ్లు, దుకాణాలు, షాపింగ్‌ మాల్స్‌లో చెల్లింపులు చేసేందుకు అవకాశం ఉంటుంది. మొబైల్‌ నెట్‌ బ్యాంకింగ్‌ సదుపాయాన్ని సైతం వినియోగించుకునే వెసులుబాటు ఉంది. 

బయోమెట్రిక్‌తోనే..
సాధారణంగా బ్యాంకు ఖాతాలను ప్రారంభించాలంటే నాలుగైదు ఫొటోలు, అన్ని ఆధారాలు ఇవాల్సి ఉంటుంది. దరఖాస్తు పత్రాలను నింపడం పెద్ద ప్రక్రియ. ఎంతో సమయం ఇందుకు వెచ్చించాలి. బ్యాంకర్లకు ఏమైనా సందేహాలు వస్తే ఇక అంతే. అయితే ఐపీపీబీలో మాత్రం దరఖాస్తుదారుడి వద్ద ఆధార్‌కార్డు ఉంటే చాలు. దాని ఆధారంగా వివరాలను నమోదు చేసుకుని బయోమెట్రిక్‌ తీసుకుంటారు. ఆ వెంటనే ఖాతాను ప్రారంభిస్తారు. ఆ సమయంలో క్యూఆర్‌ కోడ్‌తో కూడిన కార్డును అందజేస్తారు. ఎలాంటి పత్రాలను నింపాల్సిన అవసరం లేకుండానే వేలిముద్ర ద్వారా ఖాతాను నిర్వహించుకోవచ్చు. ఇది నిరక్ష్యరాస్యులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో తపాలా సేవలు అందించే తపాలా కార్యాలయాలు, పోస్ట్‌మేన్‌లే బ్యాంకింగ్‌ సేవలను అందించే వనరులగా మారనున్నారు. ఇప్పటికే తపాలా కార్యాలయాల్లో పనిచేసే వారికే శిక్షణ ఇచ్చి సేవలకు వినియోగించుకుంటున్నారు. ఐపీపీబీ సేవలను తొలుత జిల్లాలో ఏలూరు, భీమవరం డివిజన్‌లో ప్రారంభించగా  దశలవారీగా జిల్లావ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో విస్తరిస్తారు.

ఖాతాదారుల ప్రయోజనాల కోసమే ఏర్పాటు
ఖాతాదారుల ప్రయోజనాలే లక్ష్యంగా సేవలు అందించాలనే ఉద్దేశంతో ఐపీపీబీ అందుబాటులోకి తీసుకువచ్చింది. పూర్తిస్థాయిలో విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నాం. 
– రమణయ్య, ఎస్‌ఎస్, తపాలాశాఖ, భీమవరం డివిజన్‌  

>
మరిన్ని వార్తలు