28న అన్ని నియోజకవర్గాల పార్టీ శ్రేణులతో వీడియో కాన్ఫరెన్స్
మార్చి 1న విశాఖలో మోదీ బహిరంగ సభ
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందు నుంచే దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులను ఎన్నికల వైపు నడిపించడానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 28వ తేదీన ఒకే రోజు, ఒకే సమయంలో కోటి మందితో ముఖాముఖీ సమావేశం కానున్నారు. ఢిల్లీ నుంచే ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశ వ్యాప్తంగా అన్ని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇందుకు గానూ మన రాష్ట్రంలో బీజేపీ రాష్ట్ర శాఖ తగిన ఏర్పాటు చేస్తోంది.
ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం 500 మంది చొప్పున, 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో లక్ష మందికి తక్కువ కాకుండా ప్రధాని కార్యక్రమంలో పాల్గొనేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 28న జరిగే ఈ కార్యక్రమం అనంతరం.. ఆ మరుసటి రోజైన మార్చి 1వ తేదీన విశాఖపట్నంలో జరిగే పార్టీ బహిరంగ సభలో మోదీ పాల్గొంటారు.