మంత్రి పదవుల కోసం టీడీపీలో రగడ

8 Jun, 2014 17:15 IST|Sakshi
మంత్రి పదవుల కోసం టీడీపీలో రగడ

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయకముందే తెలుగుదేశంలో పార్టీలో మంత్రి పదవుల కోసం చిచ్చు చెలరేగింది. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తున్న గుంటూరు జిల్లాలోనే నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి.

చంద్రబాబు కేబినెట్లో మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పేరు లేదని తెలియడంతో ఆయన అనుచరులు నిరసనకు దిగారు. మోదుగులకు మంత్రి పదవి ఇవ్వాలని గుంటూరులోని శంకర్ విలాస్ సెంటర్లో కార్యకర్తలు రాస్తారోకో నిర్వహిస్తున్నారు. పార్టీ ఆఫీసుపై దాడి చేసి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. ఇదే జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు పదవి ఇవ్వనందుకు పార్టీ కార్యకర్తలు నిరసనకు దిగారు. చింతలపూడిలో ఆయనను అడ్డుకుని చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి వెళ్లరాదంటూ నినాదాలు చేశారు. కృష్ణా జిల్లాలోనూ సీనియర్ ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు మంత్రి పదవి దక్కలేదని అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

 

గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీ సమీపంలో చంద్రబాబు కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

మరిన్ని వార్తలు