నోటు కష్టాలు

12 Nov, 2016 09:40 IST|Sakshi
నోటు కష్టాలు
  • పెద్ద నోట్ల మార్పిడి కోసం బ్యాంకుల వద్ద జనం పడిగాపులు
  • కిటకిటలాడిన బ్యాంకులు
  • చాలని అదనపు కౌంటర్లు
  • ఒక్క రోజులో రూ.50 కోట్ల లావాదేవీలు
  • పెద్ద నోట్ల కష్టాలు జిల్లా ప్రజలను వెంటాడాయి. బ్యాంకులు తెరచుకోవడంతో.. తమవద్ద ఉన్న పాత రూ.500, రూ.వెయ్యి నోట్లను మార్చుకునేందుకు ప్రజలు పెద్ద ఎత్తున క్యూ కట్టారు. దీంతో ప్రధాన బ్యాంక్‌లతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకు బ్రాంచిలు, పోస్టాఫీసులు కూడా రోజంతా కిటకిటలాడాయి. పెద్ద సంఖ్యలో జనం వస్తారన్న ఉద్దేశంతో ఆయా బ్యాంకుల్లో అదనపు కౌంటర్లు కూడా ఏర్పాటు చేశారు. కానీ వచ్చిన జనానికి ఈ అదనపు కౌంటర్లు ఏమూలకూ చాలలేదు. దీంతో పలుచోట్ల ప్రజలు నోట్లు మార్చుకునేందుకు రోజంతా పడిగాపులు పడ్డారు.
     
    సాక్షి ప్రతినిధి, కాకినాడ :
    కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్లను ఉపసంహరించుకోవడంతో మంగళవారం రాత్రి నుంచీ జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. గురువారం బ్యాంకులు తెరచుకోవడంతో.. రద్దు చేసిన పెద్ద నోట్లు స్థానే కొత్త నోట్లు ఇచ్చే ప్రక్రియను మొదలుపెట్టారు. జిల్లావ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల పరిధిలో 756 బ్రాంచిలున్నాయి. వీటి పరిధిలో సాధారణంగా రోజూ 80 వేల మంది ఖాతాదారుల ద్వారా రూ.800 కోట్ల నగదు, రూ.300 కోట్ల చెక్కుల రూపంలో వెరసి రూ.1100 కోట్ల లావాదేవీలు జరుగుతూంటాయి. గురువారం ఒక్క రోజే ఈ 756 బ్రాంచిలలో రూ.4 వేల వంతున లక్షా 25 వేల మంది నోట్లు మార్చుకున్నారు. ఈ లెక్కన గురువారం ఒక్క రోజే ప్రజలు రూ.50 కోట్ల విలువైన నోట్లు మార్చుకున్నట్టయింది.
    ఉదయం నుంచే..
    ఉదయం ఏడు గంటల నుంచే వచ్చిన జనంతో వివిధ బ్యాంక్‌లవద్ద మెట్లు, రోడ్లు నిండిపోయాయి. కొన్నిచోట్ల తోపులాటలు చోటు చేసుకున్నాయి. కొన్ని బ్యాంకుల్లో సాయంత్రానికే నగదు నిండుకోవడంతో ఖాతాదారులు ఉసూరుమంటూ వెనుతిరిగారు. తొలి రోజు మెజారిటీ బ్యాంకులు డిపాజిట్లకే ప్రాధాన్యం ఇచ్చాయి. లైనులో నిలబడి ఎనగ్జర్‌–5 కాపీ పూర్తి చేయడానికి ఒక్కో ఖాతాదారుకు ఖాతాదారు సుమారు అరగంట పట్టింది. క్యూ నుంచి బయటకు వచ్చేస్తే మరో గంటపాటు ఇక అంతే సంగతులని లైనులో ఉంటూనే కాపీలు పూర్తి చేయడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అన్ని గంటలు క్యూలో నిలబడినా బ్యాంక్‌ల నుంచి రూ.4 వేలు మాత్రమే తీసుకోవాల్సి రావడంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు.
    పూర్తి స్థాయిలో రాని నోట్లు
    ∙బ్యాంకులకు పూర్తి స్థాయిలో కొత్త నోట్లు రాకపోవడంతో మొక్కుబడిగా నగదు ఇచ్చి చేతులు దులుపేసుకున్నారు. కాకినాడ దేవాలయం వీధిలోని ఓ బ్యాంక్‌లో ఒకటి రెండు మినహా అన్నీ కూడా డిపాజిట్లే. ఈ బ్యాంక్‌కు కేవలం రూ.10 లక్షలు మాత్రమే వచ్చింది. అదీ కూడా పాత నోట్లే ఎక్కువగా వచ్చాయని బయటకు వచ్చిన ఖాతాదారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అదే వీధిలో మరో బ్యాంక్‌కు రూ.5 లక్షలు రాగా, అందులో రూ.లక్ష నాణేలు రావడం గమనార్హం. కాకినాడ మెయి¯ŒSరోడ్డు ఎస్‌బీఐ మెయి¯ŒS బ్రాంచ్‌ కిక్కిరిసిపోయింది.
    ∙రాజమహేంద్రవరంలో ఖాతా ఉన్నవారికి రూ.10 వేలకు రూ.6 వేల మేర చిల్లర నోట్లు, రూ.2 వేల నోట్లు రెండు ఇచ్చి పంపించారు. ఎస్‌బీఐ కంబాలచెరువు బ్రాంచిలో మొదటి కొత్త రూ.2వేలు నోటు తీసుకున్న లక్ష్మి అనే యువతి ఆ నోటును ముద్దాడుతూ ఉబ్బితబ్బిబ్బయ్యింది. అదే బ్రాంచిలో సలాది వెంకటేశ్వర్లు అనే యువకుడు ‘రూ.2వేల నోటు ఇచ్చారు సరే! ఆ నోటుకు ఇప్పటికిప్పుడు చిల్లర ఎక్కడ దొరుకుతుంది? రూ.500 నోటుకే చిల్లర దొరకని పరిస్థితుల్లో కొత్త రూ.2 వేల నోటుకు ఎవరిస్తారు?’ అని బ్యాంక్‌ ఉద్యోగులను ప్రశ్నించాడు. రాజమహేంద్రవరం పేపర్‌మిల్లు ఎస్‌బీఐ, దానవాయిపేట ఎస్‌బీఐ బ్రాంచిల్లో క్యూ లైన్లు రోడ్డుపైకి వచ్చేశాయి. కిర్లంపూడి మండలం గోనేడకు చెందిన కృష్ణ స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద రూ.2వేల నోటు మార్చేందుకు ప్రయత్నించగా చిల్లర సమస్య వచ్చింది. తొలిసారి తెచ్చుకున్న రూ.2వేల నోటు ముహూర్తం బాగోలేనట్టుందంటూ వెనుదిరిగాడు.
    ∙అమలాపురంలో 22 బ్యాంకులతో ఉన్న బ్యాంక్‌ స్ట్రీట్‌ ఖాతాదారులతో కిటకిటలాడింది. ఆ వీధిలో రద్దీని దృష్టిలో పెట్టుకుని పోలీసులు ద్విచక్ర వాహనాలకు మాత్రమే అనుమతిచ్చారు. తమవద్ద ఉన్న పెద్ద నోట్లను బ్యాంకుల్లో జమ చేసి రూ.100 లేదా కొత్తగా వచ్చిన రూ.2వేల నోట్లు తీసుకునేందుకు అమలాపురంలో జనం ఎగబడ్డారు. బ్యాంకుల్లోపల స్థలం సరిపోక వారికోసం బయట షామియానాలు, కుర్చీలు వేశారు. పెద్ద నోట్ల మార్పిడి రూ.4 వేల వరకూ, విత్‌ డ్రా అవకాశం రూ.10 వేల వరకూ కల్పించారు. రూ.2 వేల నోటు విత్‌డ్రా చేసుకుని వినియోగదారులు ఆసక్తిగా చూడడంతోపాటు బ్యాంక్‌ల వద్ద వేచి ఉన్న మిగిలిన ఖాతాదారులకు చూపి సంతోషించడం కనిపించింది. ∙డిపాజిట్‌కు ఎటువంటి పరిమితీ లేదంటూనే రూ.49 వేలు దాటితే పా¯ŒSకార్డు వివరాలను బ్యాంకర్లు కోరడంతో మండపేటలో ఖాతాదారులు అసహనానికి గురయ్యారు. రామచంద్రపురంలో రాత్రి 8 గంటల వరకు బ్యాంకులు కిటకిటలాడాయి. తమకు ఎలాంటి ఆదేశాలూ రాలేదనడంతో రామచంద్రపురం పోస్టాఫీసుకు వచ్చిన ఖాతాదారులు వెనుతిరిగారు. తునిలో కూడా ఖాతాదారులు బ్యాంకుల వద్ద క్యూకట్టారు. పోస్టాఫీసుల్లో ఒక్కో ఖాతాదారుడికి రూ.4 వేల చిల్లర నోట్లు ఇచ్చారు. సామర్లకోటలోని పలు బ్యాంకుల్లో రూ.2 వేల నోట్లు ఇవ్వడంతో వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు. రూ.500కు చిల్లర దొరకని పరిస్థితుల్లో రూ.2 వేలు ఇవ్వడమేమిటని ఖాతాదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పోస్టాఫీసులో పవర్‌కట్‌ కాగా, జనరేటర్‌ పని చేయకపోవడంతో ఖాతాదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాకినాడ రూరల్‌లో మూడు గంటల వరకూ బ్యాంకులు పని చేయలేదు. ఏజెన్సీలోని బ్యాంకుల్లో నగదు జమ చేసేందుకు, విత్‌డ్రా కోసం ఖాతాదారులు క్యూ కట్టారు.
    సందట్లో సడేమియా..
    సందట్లో సడేమియాగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అమాయకులను లక్ష్యంగా చేసుకుని మోసగిస్తున్నారు. రాజోలు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్రాంచి వద్ద బంగారం విడిపించుకునేందుకు వచ్చిన స్థానిక స్వర్ణకారుడు వరదా నాగ వెంకట సత్య కేశవకు టోకరా వేసిన ఓ గుర్తు తెలియని వ్యక్తి రూ.30 వేలకు టోకరా వేసి ఉడాయించాడు. పి.గన్నవరం మండలం జి.పెదపూడి శివారు ఉచ్చులవారిపేటకు చెందిన గోడి రాజేశ్వరి అనే వృద్ధురాలికి మాయమాటలు చెప్పిన ఓ వ్యక్తి రూ.20 వేలు కాజేశాడు.
    సందేహాల నివృత్తికి టోల్‌ఫ్రీ నంబర్లు
    పెద్ద నోట్ల మార్పిడికి సంబంధించి సందేహాల నివృత్తి కోసం టోల్‌ఫ్రీ నంబర్లతో హెల్ప్‌లై¯ŒS ఏర్పాటు చేశారు. నోడల్‌ ఆఫీసర్‌ రెహ్మా¯ŒS : 83328 60578, కలెక్టరేట్‌లో 1800 425 3077 నంబర్లతో ఇది పని చేస్తుంది.
     
    ఆందోళన వద్దు
    రూ.500, రూ.వెయ్యి నోట్ల రద్దుపై ప్రజలు ఏమాత్రం ఆందోళన చెందనవసరం లేదు. వారికోసం బ్యాంకుల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. శని, ఆదివారాల్లో కూడా బ్యాంకులు పని చేస్తాయి. డిసెంబర్‌ 30 వరకూ నోట్ల మార్పిడి విధానం అమలులో ఉంటుంది. కొత్త నోట్లు శుక్రవారం నుంచి అన్ని ఏటీఎంలలోకీ అందుబాటులోకి వస్తాయి.
    – డీవీ సుబ్రహ్మణ్యం, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్, కాకినాడ
     
మరిన్ని వార్తలు