సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్లో శుక్రవారం కొత్తగా 1608 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 21,020 సాంపిల్స్ను పరిక్షించగా అందులో 1576 కేసులు ఏపీలో నమోదవ్వగా, మిగతా 32 కరోనా కేసులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారివి ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు సంఖ్య 25, 422కి చేరింది. ఈ మేరకు ఏపీ వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి కొత్తగా 981 మంది డిశ్చార్జి కాగా .. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 13,194గా ఉంది. తాజాగా కరోనాతో మరో 15 మంది మృతి చెందడంతో రాష్ట్రంలో మరణాల సంఖ్య 292కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 11,936 యాక్టివ్ కేసులుగా ఉన్నాయి.
కాగా రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో నిర్వహిస్తున్న కరోనా వైద్య పరీక్షలు 11లక్షల మార్కును దాటాయి. ఇప్పటివరకు 11,15,635 మందికి కరోనా వైద్య పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో ప్రతి మిలియన్కు 20,892 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు పేర్కొన్నారు.