రెండు పోస్టులు.. 20 వేలకు పైగా దరఖాస్తులు

16 Nov, 2013 03:57 IST|Sakshi

కాకినాడ, న్యూస్‌లైన్ : ఉన్నవి రెండే ఉద్యోగాలు. కానీ, వాటి కోసం వచ్చిన దరఖాస్తులు మాత్రం 20వేలకు పైనే. ఇది అతిశయోక్తి కాదు, నిరుద్యోగ సమస్యకు నిలువుటద్దం పట్టే అచ్చమైన నిజం. జిల్లాలో ఖాళీగాఉన్న 68 పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీకి ఈనెల 6న నోటిఫికేషన్ జారీ చేశారు. దీనిలో 62 పోస్టులకు ఇప్పటికే కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న వారు అర్హులు.
 
 మిగిలిన ఆరింటిలో రెండు వికలాంగులకు, రెండు మహిళలకు కేటాయించారు. ఇక మిగిలిన రెండు పోస్టుల కోసం దరఖాస్తులు వెల్లువెత్తాయి. వాటిని గ్రేడింగ్ చేసేందుకు పంచాయతీ కార్యాలయ సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. కాగా ఈ 20 వేలమందిలో ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులు మినహా మిగిలినవారు రూ.50 చొప్పున డీడీల రూపంలో దరఖాస్తు రుసుముగా చెల్లించింది రూ.5లక్షలకు పైనేనని అంచనా.

మరిన్ని వార్తలు